కువైత్‌లో అంగరంగ వైభవంగా ప్రవాసాంధ్రుల కిక్రెట్ టోర్నమెంట్

ABN , First Publish Date - 2021-01-21T01:43:29+05:30 IST

కువైత్‌లో గల్ఫ్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కువైత్‌లో నివసిస్తున్న వివిధ జిల్లాల

కువైత్‌లో అంగరంగ వైభవంగా ప్రవాసాంధ్రుల కిక్రెట్ టోర్నమెంట్

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: కువైత్‌లో గల్ఫ్ బాబాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కువైత్‌లో నివసిస్తున్న వివిధ జిల్లాలకు చెందిన ప్రవాసాంధ్ర యువ క్రికెటర్లు ఈ కార్యక్రమంలో అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. గత పది నెలలుగా కరోనా కట్టడి, ఆపై ఇతరత్రా కారణాల వల్ల స్తబ్దతగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రవాసీయులలో ఒక నూతన ఉత్తేజాన్ని నింపే విధంగా జరిగిన ఈ కార్యక్రమం జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి కువైత్‌లోని భారతీయ రాయబారి సిబి జార్జి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 


డిసెంబర్ 11న ప్రారంభమైన ఈ క్రీడోత్సవంలో అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 16 బృందాలు పాల్గొనగా, నాలుగు జట్లుగా అత్యంత ఆసక్తికరంగా క్రికెట్‌ను ఆడారు. ఈ క్రికెట్ క్రీడాభిమానులను అద్యతం రక్తి కట్టించగా, సంక్రాంతి సందర్భంగా జరిగిన తుదిపోరు ఎనలేని ఆసక్తిను నింపింది. ఏపీ11, బీ.యల్.కే జట్ల మధ్య హోరాహోరిగా జరిగిన పోరులో కడప జిల్లాకు చెందిన కెప్టెన్ షఫీ అధ్వర్యంలోని ఏపీ11  టీం 5.1 ఓవర్లలో 8 వికెట్లకు 156 పరుగులు చేసి విజేతగా నిలిచింది.


శెఫ్ సునీల్ చెక్కిన రాయబారి సిబి జార్జి ముఖచిత్రం కలిగిన తర్బూజ పండు కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత త్రివర్ణ రంగులతో కూడిన బెలూన్లను రాయబారి గాలిలో ఊది లాంఛనంగా ముగింపు పోటీలను ప్రారంభించారు. కువైత్‌లో కష్టాల్లో ఉన్న తెలుగు వారికి ఎల్లప్పుడు తన వంతుగా సహాయ సహాకారాలను అందించే ప్రముఖ సామాజిక కార్యకర్త దుగ్గి గంగాధర్‌కు ఈ సందర్భంగా భారతీయ రాయబారి సీబీ ప్రత్యేక పురస్కారాన్ని అందించారు. టోర్నమెంట్‌లో పాల్గొన్న బృందాలకు ఆబుబకర్, వెంకట్ కోడూరి బహుమతులు అందించారు. 


కడప జిల్లాకు చెందిన గిరిబాబు ఆధ్వర్యంలోని రుబీక్స్ మీడియా. గల్ఫ్ రాయలసీమ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో గల్ఫ్ బాబాయిగా పేరొందిన గిరి అన్నీ తానై వ్యవహరించగా అందరితో పాటు కమనీయమైన వాతవారణం కూడా అందుకు సహకరించింది. కాగా.. ఈ కార్యక్రమంలో మొత్తంగా ఏపీ11, టీయస్పీ, జాలీ11, టి.యల్.కె.యస్, ఆంధ్ర వారియర్స్, యూ భారత్, మనం, ఆర్.ఆర్.ఆర్ లైన్స్, టి.సి.సి, యస్.టి.11, మర్హబా, బి.యల్.కె, యఫ్.సి.సి, కోన సీమ, కడప కింగ్స్, నేషనల్ ఈగల్స్ అనే క్రికెట్ బృందాలు పాల్గొన్నాయి.

Updated Date - 2021-01-21T01:43:29+05:30 IST