రాత్రి భోజనానికని బయటకు వెళ్లిన NRI జంటకు షాకింగ్ అనుభవం!
ABN , First Publish Date - 2022-04-18T02:10:59+05:30 IST
రాత్రి భోజనానికని కారులో బయటకు వెళ్లిన ఎన్నారై జంటకు ఊహించని అనుభవం ఎదురైంది. ఓవర్ టేకింగ్ విషయంలో మరో కారు యజమానితో జరిగిన గొడవలో వారు గాయాలపాలయ్యారు.
ఎన్నారై డెస్క్: రాత్రి భోజనానికని కారులో బయటకు వెళ్లిన ఎన్నారై జంటకు ఊహించని అనుభవం ఎదురైంది. ఓవర్ టేకింగ్ విషయంలో మరో కారు యజమానితో జరిగిన గొడవలో వారు గాయాలపాలయ్యారు. పంజాబ్లోని జలంధర్ జిల్లాలోగల మిత్తాపూర్ గ్రామం వద్ద ఇటీవల ఈ ఘటన జరిగింది. ఆస్ట్రేలియాకు చెందిన ఆ దంపతుల కొద్ది రోజుల క్రితం భారత్కు వచ్చారు. ఇటీవల ఓ రోజు వారు భోజనం చేసేందుకు కారులో బయటకు వెళ్లారు. రాహదారిపై వెళుతుండగా మరో కారు వారిని రాంగ్ రూట్లో ఓవర్ టేక్ చేసింది. ఇలా చేయడం తప్పంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది గమనించి అవతలి వ్యక్తి తన కారును వారి ముందు ఆపి గొడవకు దిగాడు. చివరకు అతడు తనపై చేయి చేసుకున్నాడని ఆ ఎన్నారై ఆరోపించాడు. తన వద్ద ఉన్న బంగారం చెయిన్ కూడా లాక్కున్నాడని తెలిపాడు.
అయితే.. నిందితుడు రాజ్బీర్ మాత్రం వారి వాదనను ఖండించాడు. ఎన్నారై దంపతులే తన కారు అద్దాలు పగలగొట్టారని, తన వద్ద ఉన్న బంగారు గొలుసు, నగదు లాక్కున్నారని చెప్పుకొచ్చాడు. అయితే.. గొడవ గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఎన్నారై జంటను ఆస్పత్రికి తరలించారు. మరోవైపు.. పోలీసులతీరుపైనా ఎన్నారై జంట అసహనం వ్యక్తం చేశారు. తమపై రాజ్బీర్ మళ్లీ దాడి చేసే అవకాశం ఉన్నా అతడిని తమతో పాటే ఆస్పత్రికి తీసుకొచ్చారని ఆరోపించారు. ఎంబసీకి ఫిర్యాదు చేస్తామంటూ అగ్గిమీద గుగ్గిలమయ్యారు.