ప్రతీ మ్యాచ్ గెలవగలమన్న నమ్మకం ఉంది: తమిమ్ ఇక్బాల్

ABN , First Publish Date - 2020-06-03T01:00:42+05:30 IST

అంతర్జాతీయ క్రికెట్‌లో పిల్లకూనగా అడుగుపెట్టి ఇప్పుడు పెద్ద జట్లకు ఏ మాత్రం తీసిపోని స్థాయికి ఎదిగిన...

ప్రతీ మ్యాచ్ గెలవగలమన్న నమ్మకం ఉంది: తమిమ్ ఇక్బాల్

ఢాకా: అంతర్జాతీయ క్రికెట్‌లో పిల్లకూనగా అడుగుపెట్టి ఇప్పుడు పెద్ద జట్లకు ఏ మాత్రం తీసిపోని స్థాయికి ఎదిగిన జట్టు బంగ్లాదేశ్. ఎప్పుడో ఒకసారి గెలిచి సంచలనం సృష్టించడం తప్ప వరుస విజయాలు మాత్రం ఆ జట్టుకు ఏనాడూ లేవు. అయితే ఈ మధ్య కాలంలో బంగ్లాదేశ్ జట్టు పటిష్ఠంగా తయారవుతోంది.  ఈ విషయం ఇతర దేశాల క్రికెట్ జట్లకూ అర్థం అవుతోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఓపెనర్ తమిమ్ ఇక్బాల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమ జట్టు పరిస్థితి గురించి సంభాషించారు. బంగ్లా జట్టు మునుపటిలా లేదని, ప్రపంచంలోని ఏ జట్టునైనా ఓడించే స్థాయికి తాము చేరామని చెప్పాడు. ‘ఐదారేళ్ల క్రితం పెద్ద జట్టుతో మ్యాచ్ అంటే గ్రౌండ్‌లోకి వెళ్లే సమయానికే మ్యాచ్ ఫలితం ఖరారైపోయి ఉండేది. మేం గెలవడం పక్కనుంచితే ఏ మాత్రం పోటీ ఇస్తామో అనే అందరూ చూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఎదురు ఎంత పెద్ద జట్టు ఉన్నా గెలవగలమన్న నమ్మకం ఇప్పుడు మా జట్టుకు ఉంది. డ్రెస్సింగ్ రూంలో ఉన్న ప్రతి ఆటగాడూ మ్యాచ్‌లో గెలవాలనే తపనతోనే ఉంటున్నాడు.


ఇది మాలో వచ్చిన అతి పెద్ద మార్పు. బంగ్లాదేశ్ ప్రజలు కూడా దీన్ని పూర్తిగా విశ్వశిస్తున్నారు’ అంటూ తమిమ్ ఇక్బాల్ పేర్కొన్నాడు. 2019 ప్రపంచ కప్‌లో తమ జట్టు 8వ స్థానంలో నిలిచినప్పటికీ గ్రూప్ దశలో వెస్టిండీస్‌ వంటి భారీ జట్టుపై  గెలిచామని, న్యూజీలాండ్‌ మ్యాచ్‌లో గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా అంచుల వరకూ వెళ్లామని తమిమ్ చెప్పుకొచ్చాడు. ఇకముందు మరింత మెరుగ్గా రాణించగలమని, ప్రతి మ్యాచ్‌ను గెలిచేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసం తమకుందని తమిమ్ పేర్కొన్నాడు.

Updated Date - 2020-06-03T01:00:42+05:30 IST