ఇక ‘బ్రాండెడ్‌’ మాస్క్‌లు!

ABN , First Publish Date - 2020-07-02T05:01:56+05:30 IST

కరోనా కాలంలో అందరూ మాస్క్‌ మంత్రాన్నే జపిస్తున్నారు. అందుకే మొదట్లో లోకల్‌ మాస్క్‌లు మార్కెట్లోకి వచ్చినా, క్రమక్రమంగా అనేక బ్రాండ్స్‌ రకరకాల ...

ఇక ‘బ్రాండెడ్‌’ మాస్క్‌లు!

కరోనా కాలంలో అందరూ మాస్క్‌ మంత్రాన్నే జపిస్తున్నారు. అందుకే మొదట్లో లోకల్‌ మాస్క్‌లు మార్కెట్లోకి వచ్చినా, క్రమక్రమంగా అనేక బ్రాండ్స్‌ రకరకాల మాస్క్‌లకు మార్కెట్‌ను సృష్టిస్తున్నాయి. చేనేత, సిల్క్‌, లెనెన్‌ వంటి వెరైటీలతో... ఆఫీసు, పెళ్లి, పార్టీ... ఇలా వివిధ సందర్భాలకు అవసరమైన మాస్క్‌లను అందుబాటులోకి తెచ్చేందుకు ఇప్పటికే ప్రముఖ బ్రాండ్లు రంగం సిద్ధం చేసుకున్నాయి.


సేఫ్టీ కోసం ధరిస్తున్న మాస్క్‌ త్వరలో ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్‌గా కూడా మారబోతోంది. ముందు ముందు మాస్క్‌ లేని ముఖం కనిపించదు కాబట్టి, మన దేశంలోని టాప్‌ బ్రాండ్ల దృష్టి కూడా మాస్క్‌ల తయారీపై పడింది. నీనాగుప్తా కూతురు ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మసాబాకు చెందిన ‘హౌస్‌ ఆఫ్‌ మసాబా’ బ్రాండ్‌తో పాటు లూయిస్‌ ఫిలిప్‌, ఫాస్ట్‌ట్రాక్‌, ఆరెలియా వంటి బ్రాండ్లు ఇప్పటికే ఆన్‌లైన్‌లో డిజైనర్‌ మాస్క్‌ల అమ్మకాలు మొదలెట్టాయి. 


ఆన్‌లైన్‌ అమ్మకాలు...

కరోనా నేపథ్యంలో ప్రముఖ బ్రాండ్లు తయారుచేసిన మాస్క్‌లు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అందరికీ అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా లోకల్‌ మాస్క్‌లు 30 రూపాయల నుంచి 50 రూపాయల్లో లభ్యమవుతుంటే, బ్రాండెడ్‌ మాస్క్‌ల ధర మాత్రం కాస్త ఎక్కువగానే ఉంటోంది. ఉదాహరణకు మసాబా గుప్తాకు చెందిన ‘హౌస్‌ ఆఫ్‌ మసాబా’కు చెందిన డిజైనర్‌ మాస్క్‌లు రకరకాలుగా ఉన్నాయి. వాటి ధర ఫ్యాబ్రిక్‌, నాణ్యతను బట్టి 700 రూపాయల నుంచి 900 రూపాయల దాకా ఉన్నాయి. భారతీయ యాక్సెసరీ బ్రాండ్‌ ‘ఫాస్ట్‌ట్రాక్‌’ కూడా మాస్క్‌ల అమ్మకాలు మొదలెట్టింది. వాటిలో ఫోర్‌ప్లై మాస్క్‌ల ధర (మూడు నాలుగు మాస్క్‌లుండే సెట్‌కు) 500 రూపాయల నుంచి 800 రూపాయలుగా ఉన్నాయి. ‘‘వారం రోజుల్లోనే మా మాస్క్‌లకు మంచి డిమాండ్‌ ఏర్పడింది’’ అని ఫాస్ట్‌ట్రాక్‌ మార్కెటింగ్‌ హెడ్‌ కన్వల్‌ప్రీత్‌ వాలియా తెలిపారు.


హ్యాండ్‌ బ్లాక్‌ ప్రింట్లతో రంగురంగుల మాస్క్‌లు తయారుచేసిన ‘ఫ్యాబ్‌ ఇండియా’ మూడు మాస్క్‌లున్న ప్యాక్‌ ధరను 100 రూపాయలుగా, ఐదు మాస్క్‌లున్న ప్యాక్‌ ధరను 150 రూపాయలుగా నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న డిమాండ్‌ను బట్టి రోజుకు సుమారుగా 50 వేల మాస్క్‌లు తయారుచేసేందుకు ఇప్పటికే ఫ్యాబ్‌ ఇండియా ప్రణాళికలు రచించింది. ‘‘ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ రానున్న రెండేళ్లలో మాస్క్‌ల మార్కెట్‌ సుమారుగా 3 బిలియన్‌ డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది’’ అని ‘టెక్స్‌టైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా’ అధ్యక్షుడు అశోక్‌ జునేజా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.


విభిన్న మాస్క్‌లతో కనువిందు...

ఆన్‌లైన్‌లో మాస్క్‌ల అమ్మకాలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఈ-షాపింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌ చెబుతున్నాయి. ఇప్పటికే ‘అల్లిక దుస్తుల కేంద్రం’గా చెప్పుకునే తమిళనాడులోని తిరుప్పూర్‌లో మాస్క్‌ల తయారీ పెద్ద సంఖ్యలో జరుగుతోంది. ప్రపంచ ప్రసిద్ధ లూయిస్‌ వూటన్‌, బర్‌బెర్రీ బ్రాండ్లు మాస్క్‌లు కూడా త్వరలోనే ఫ్యాషన్‌ ప్రపంచంలోకి అడుగిడుతాయని డిజైనర్లు చెబుతున్నారు. కరోనా కారణంగా దుస్తులకు ఇప్పుడిప్పుడే గిరాకీ ఉండదు కాబట్టి ప్రత్యామ్నాయంగా అన్ని బ్రాండ్లు కూడా డిజైనర్‌ మాస్క్‌లపై దృష్టి సారిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇంకేం... రానున్న కాలంలో మ్యాచింగ్‌ మాస్క్‌లు, విభిన్న ఫ్యాబ్రిక్‌ మాస్క్‌లు, వివిధ వేడుకలకు డిజైనర్‌ మాస్క్‌లు ధరించేందుకు సిద్ధంకండి.  



Updated Date - 2020-07-02T05:01:56+05:30 IST