RSS: నవంబర్ 6న ఆర్ఎస్ఎస్ ర్యాలీకి అనుమతి
ABN , First Publish Date - 2022-10-01T14:08:22+05:30 IST
రాష్ట్రంలో నవంబర్ 6న ఆర్ఎస్ఎస్(RSS) సంస్థ ర్యాలీ నిర్వహించేందుకు అనుమతించాలంటూ మద్రాసు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి శుక్రవారం
- రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వు
చెన్నై, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నవంబర్ 6న ఆర్ఎస్ఎస్(RSS) సంస్థ ర్యాలీ నిర్వహించేందుకు అనుమతించాలంటూ మద్రాసు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ ప్రభుత్వం అనుమతివ్వకుంటే కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన కింద తదుపరి చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించింది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న రాష్ట్రంలోని 50 నగరాల్లో ఆర్ఎస్ఎస్(RSS) ర్యాలీలు జరపాలని నిర్ణయించింది. ఆ మేరకు ఆయా ప్రాంతాల్లో పోలీసుల అనుమతి కోరుతూ ఆర్ఎ్సఎస్ నిర్వాహకులు వినతి పత్రాలు సమర్పించారు. అయితే పోలీసులు ర్యాలీకి అనుమతి నిరాకరించడంతో ఆ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు విచారణ జరిపి కొన్ని షరతులతో అక్టోబర్ 2న ర్యాలీ చేసేందుకు ఆర్ఎస్ఎస్(RSS)కు అనుమతి మంజూరు చేసింది. అయితే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థపై కేంద్ర ప్రభుత్వం ఐదేళ్లపాటు నిషేధం విధించిన నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్(RSS) ర్యాలీకి అనుమతిని నిరాకరించింది. దీనిని సవాలు చేస్తూ ఆర్ఎస్ఎస్(RSS) రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ఉత్తర్వులను ఉల్లఘిస్తోందంటూ హైకోర్టును ఆశ్రయించింది. ఆర్ఎస్ఎస్(RSS) పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు నవంబర్ 6న ఆ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీ చేసుకునేందుకు పోలీసు శాఖ అనుమతివ్వాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులు అమలు చేయకుండా ర్యాలీకి అనుమతి నిరాకరిస్తే కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన కింద ప్రభుత్వంపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇక కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన పిటిషన్పై తదుపరి విచారణ అక్టోబర్ 31కి వాయిదా వేసింది.