ఆ పంచాయతీలకు నోటిఫికేషన్
ABN , First Publish Date - 2021-03-04T06:47:12+05:30 IST
జిల్లాలో వివిధ కారణాలతో ఎన్నికలు జరగని పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్ని కలు నిర్వహించేందుకు ఎస్ఈసీ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
- ఎన్నికలు జరగని చోట నిర్వహణ
కర్నూలు, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వివిధ కారణాలతో ఎన్నికలు జరగని పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్ని కలు నిర్వహించేందుకు ఎస్ఈసీ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి మొదలవు తుంది. ఈ నెల 6వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 7వ తేదీన నామినేషన్ల పరిశీలన, 8వ తేదీన అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. ఈ నెల 15వ తేదీన పోలింగ్, కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.
15 మండలాల్లో..
జిల్లాలోని 15 మండలాల పరిధిలోని 24 పంచాయతీల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలు జరగలేదు. పూడూరు పంచాయతీలో సర్పంచ్ స్థానంతో పాటు అన్ని వార్డులకు ఎన్నికలు జరగలేదు. మిగతా మండలాల్లో కొన్ని వార్డులకు మాత్రమే ఎన్ని కలు జరగాల్సి ఉంది. కర్నూలు మండలంలోని పూడూరు పంచాయతీ ప్రజలు తమ ఊరికి రోడ్డు వేయనందుకు నిరసనగా ఎన్నికలను బహిష్కరించారు. ఈ పంచాయతీకి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సారైనా గ్రామ ప్రజలు ఎన్నికల్లో పాల్గొంటారో లేదో వేచి చూడాల్సిందే.