పేరెంట్స్ కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్
ABN , First Publish Date - 2021-09-17T05:42:05+05:30 IST
జిల్లాలోని 4,133 పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీల ఎన్నికల నిర్వహణకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు.
జిల్లాలోని 4,133 పాఠశాలల్లో ఓటర్ల జాబితాలు విడుదల
అభ్యంతరాలు తెలపడానికి 20 వరకూ గడువు
22న ఎన్నికల నిర్వహణ
చంద్రంపాలెం పాఠశాలలో 4,079 మంది ఓటర్లు
విశాఖపట్నం, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని 4,133 పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీల ఎన్నికల నిర్వహణకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రతి పాఠశాలలో సంబంధిత ప్రధానోపాధ్యాయుడు గురువారం ఉదయం నోటిఫికేషన్ జారీచేసి మధ్యాహ్నం తల్లిదండ్రుల పేర్లతో కూడిన ఓటర్ల జాబితాను ప్రదర్శించారు. జిల్లాలో గరిష్ఠంగా చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 4,079 మంది విద్యార్థుల తరపున తల్లి/తండ్రి పేరుతో జాబితాను హెచ్ఎం రాజబాబు ప్రదర్శించారు. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు తెలపడానికి ఈ నెల 20వ తేదీ ఉదయం వరకూ గడువిచ్చారు. అదేరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఓటర్ల తుది జాబితా ప్రదర్శిస్తారు. ఈనెల 22న ఎన్నికలు జరుగుతాయని సమగ్ర శిక్షా అభియాన్ ఇన్చార్జి ఏపీసీ బి.లింగేశ్వరరెడ్డి తెలిపారు.
17 పదవులు...నలుగురే ఓటర్లు?
రెండు ఉర్దూ స్కూళ్లలో వింత పరిస్థితి
ఎస్.రాయవరం, సెప్టెంబరు 16: ప్రతి పాఠశాలలో పేరెంట్స్ కమిటీకి చైర్మన్, వైస్ చైర్మన్తోపాటు ఒక్కో తరగతికి ముగ్గురి చొప్పున సభ్యులను ఎన్నుకోవాలి. కానీ ఎస్.రాయవరం మండలం చెల్లాపురం, సీతారాంపురంలోని ఉర్దూ ప్రాథమిక పాఠశాలల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఒక్కో పాఠశాలలో నలుగురు మాత్రమే విద్యార్థులు వున్నారు. గురువారం ఆయా విద్యార్థుల తల్లి/తండ్రి పేర్లతో ఓటరు జాబితాలను విడుదల చేశారు. కమిటీ ఏర్పాటు చేయాలంటే 17 మంది పేరెంట్స్ ఉండాలి. కానీ ఈ పాఠశాలల్లో నలుగురు మాత్రమే ఉన్నారు. అయినప్పటికీ విద్యా శాఖ మార్గదర్శకాల మేరకు ఈ నెల 22న పేరెంట్స్ కమిటీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.