కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోని ఫ్రంట్ లైన్ వారియర్స్కు నోటీసులు
ABN , First Publish Date - 2021-03-04T07:36:03+05:30 IST
మొదటి, రెండు దశల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోని ఫ్రంట్ లైన్ వారియర్స్కు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధం కాబోతున్నాయి.
కలికిరి, మార్చి 3: మొదటి, రెండు దశల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోని ఫ్రంట్ లైన్ వారియర్స్కు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధం కాబోతున్నాయి. మొదటి దశలో పారిశుధ్య, వైద్య ఆరోగ్య శాఖ, అంగన్వాడీ కార్యకర్తలకు ప్రాధాన్యమిచ్చారు. రెండో దశలో పోలీసు, పంచాయతీ రాజ్, రెవెన్యూ శాఖల ఉద్యోగులకు వాక్సినేషన్ కార్యక్రమం జరిగింది.మొత్తం మీద 60 శాతం మందికి కూడా వ్యాక్సిన్ వేయలేకపోయారు.ఉద్యోగుల అనాసక్తే ఇందుకు ప్రధాన కారణంగా గుర్తించారు. దీంతో టీకాలు వేసుకోని వారందరికీ నోటీసులు జారీ చేయాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశించినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పేర్కొన్నారు.నిర్దిష్ట నమూనాలో ‘టీకాలు వేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలన్నింటినీ వివరించారని, తామే అందుకు సుముఖంగా లేమని, తరువాత దీని వల్ల కలిగే దుష్పరిణామాలకు తామే బాధ్యత వహించగలమని’ వారి వద్ద నుంచి రాతపూర్వకంగా తీసుకోవాలని ఆదేశించారు. దీంతో అన్ని శాఖలకు చెందిన అధికారులు నోటీసులు జారీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. గురువారం సాయంకాలానికి నోటీసులకు జవాబులను ప్రభుత్వానికి చేర్చాలనే ప్రయత్నాల్లో వున్నారు.సచివాలయ సిబ్బందికి నోటీసులు జారీ చేసే పనిలో పంచాయతీ కార్యదర్శులున్నారు. వీటికి జవాబు పత్రాలను గురువారం సాయంకాలంలోగా చేర్చాలని ఎంపీడీవో వెంకటేశులు ఆదేశించారు.