ఓటుకు నోటు కేసు..

ABN , First Publish Date - 2020-10-24T09:14:36+05:30 IST

ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్‌సింహ దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్లపై ఏసీబీ అధికారులు ఏసీబీ ప్రత్యేక కోర్టులో

ఓటుకు నోటు కేసు..

సండ్ర, ఉదయసింహపై ఆధారాలున్నాయి

డిశ్చార్జి పిటిషన్లపై ఏసీబీ కౌంటర్‌


హైదరాబాద్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్‌సింహ దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్లపై ఏసీబీ అధికారులు ఏసీబీ ప్రత్యేక కోర్టులో కౌంటర్లు ఫైల్‌ చేశారు. ఈ కేసులో ఏ-5గా ఉన్న సండ్ర మిగతా నిందితులతో కలిసి కుట్రపన్నారని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. రేవంత్‌ రెడ్డి (ఏ1), సెబాస్టియన్‌ (ఏ2), ఉదయ్‌సింహ (ఏ3), జెరూసలెం మత్తయ్య (ఏ4)తో కలిసి సండ్ర అన్ని విషయాలపై చర్చించారని.. ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని కౌంటర్‌ పిటిషన్‌లో వివరించారు. 2015లో జరిగిన టీడీపీ మహానాడులో నిందితులు ఈ కుట్రపన్నారని పేర్కొన్నారు. స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెట్టి.. టీడీపీ అభ్యర్ధి నరేందర్‌ రెడ్డిని గెలిపించాలని పథకం రూపొందించారని వివరించారు. రేవంత్‌తోపాటు, ఇతర నిందితులతో సండ్ర జరిపిన ఫోన్‌ సంభాషణలకు సంబంధించిన సీడీఆర్‌ల వివరాలు తమ వద్ద ఉన్నాయన్నారు. శంషాబాద్‌ నోవాటెల్‌ హోటల్‌లో ఇతర నిందితులు ఉన్న సమయంలో.. సండ్ర అక్కడకు వెళ్లారని, అక్కడే రేవంత్‌ రెడ్డి, సెబాస్టియన్‌తో చర్చలు జరిపారని పేర్కొన్నారు. ఉదయ్‌సింహ విషయంలోనూ తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. న్యాయస్థానం ఈ కేసు విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది.

Updated Date - 2020-10-24T09:14:36+05:30 IST