చెరువు కాదు... జగనన్న కాలనీ

ABN , First Publish Date - 2021-07-22T04:33:14+05:30 IST

మండల పరిధిలోని అమృతానగర్‌ ఏర్పాటు చేసిన జగనన్న కాలనీ చెరువును తలపిస్తోంది. కాలనీలో ఏర్పాటు చేసిన రోడ్లు సైతం నీట మునివా వాటి ఆకారం కనిపించకుండా పోయింది.

చెరువు కాదు... జగనన్న కాలనీ
జగనన్న కాలనీలో వర్షపు నీరు నిలిచి చెరువును తలపిస్తున్న దృశ్యం

ఇలా ఉంటే ఇళ్లు ఎలా నిర్మించుకోవాలి

లబ్ధిదారుల ఆవేదన


ప్రొద్దుటూరు రూరల్‌, జూలై 21: మండల పరిధిలోని అమృతానగర్‌ ఏర్పాటు చేసిన జగనన్న కాలనీ చెరువును తలపిస్తోంది. కాలనీలో ఏర్పాటు చేసిన రోడ్లు సైతం నీట మునివా వాటి ఆకారం కనిపించకుండా పోయింది. ఇళ్లస్థలాలు ఇలా వర్షపు నీటితో నిండితే ఇళ్లను ఎలా నిర్మించుకోవాలని లబ్దిదారులు ప్రశ్నిస్తున్నారు. వర్షపునీరు ఎటూ వెళ్లేందుకు వీలు లేకపోవడంతో ఇళ్లస్థలాల్లో నిలిచి  చెరువులా దర్శనమిస్తోంది. అధికారులు మాత్రం వర్షపు నీరు వెళ్లేందుకు ఎక్స్‌కవేటర్‌ ద్వారా కాలువను తవ్వించిన ఫలితం లేకుండాపోయింది. ఓవైపు ప్రభుత్వం గ్రామ పంచాయతీ అధికారులను, మండల అధికారులను, హౌసింగ్‌ అధికారులను ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలంటూ టార్గెట్లు ఇస్తూ ఒత్తిడి చేస్తున్నారు. అయితే ఇక్కడ మాత్రం అధిక వర్షాల కారణంగా ఇళ్ల స్థలాల్లో నీరు నిలవడంతో నిర్మాణాలు చేపట్టేందుకు వీలు లేకుండాపోయింది. దీంతో అధికారులు, లబ్ధిదారులు ఏమి చేయలేక నిమ్మకుండిపోయారు. అమృతానగర్‌కు పైభాగాన ఉన్న రింగ్‌రోడ్డు సమీపం నుంచి వచ్చే వర్షపునీరు అంతా జగనన్న కాలనీల్లోని ఇళ్లస్థలాల వద్దకే వచ్చి చేరుతోంది. అక్కడి నుంచి తగ్గుప్రాంతాలకు వర్షపునీరు పోయేందుకు వీలులేకుండా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు గోడలు కట్టి నీరుపోయే దారులను మూసివేశారు. దీని వలన తగ్గు ప్రాంతాలకు నీరు వెళ్లలేక అమృతానగర్‌లోని అన్ని వీధులతోపాటు సమీపంలో ఉన్న జగనన్న కాలనీ ఇళ్ల స్థలాల్లో కూడా ఎక్కువగా నీరు చేరుతోంది. ఈవిషయంపై గ్రామ పంచాయతీ కార్యదర్శి పుల్లారెడ్డిని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా వర్షపు నీరు పోయేందుకు ఎక్స్‌క వేటర్‌ ద్వారా కాలువను తవ్వించామని, అయినా కూడా వర్షపునీరు వెళ్లడం లేదన్నారు.

Updated Date - 2021-07-22T04:33:14+05:30 IST