తగ్గని వ్యాప్తి
ABN , First Publish Date - 2021-07-31T05:52:05+05:30 IST
జిల్లాలో కరోనావైరస్ వ్యాప్తి ఇంకా పూర్తిస్థాయిలో తగ్గలేదు. ఇప్పటికీ కొన్నిచోట్ల పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మళ్లీ ఇంటింటి సర్వేకు సిద్ధమవుతున్నారు.
జిల్లాలో పూర్తిస్థాయిలో తగ్గని కరోనా వైరస్ వ్యాప్తి
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో నమోదవుతున్న పాజిటివ్ కేసులు
థర్డ్ వేవ్ వదంతులతో ఆసుపత్రుల్లో ముందస్తు ఏర్పాట్లు
ఆగస్టు 3వ తేదీ నుంచి మళ్లీ ఇంటింటి ఆరోగ్య సర్వే
ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలంటున్న వైద్య నిపుణులు
నిజామాబాద్, జూలైౖ 30 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో కరోనావైరస్ వ్యాప్తి ఇంకా పూర్తిస్థాయిలో తగ్గలేదు. ఇప్పటికీ కొన్నిచోట్ల పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మళ్లీ ఇంటింటి సర్వేకు సిద్ధమవుతున్నారు. కరోనా పాజిటివ్ వచ్చినవారిని గుర్తించడంతో పాటు వారికి చికిత్స అందించేందుకు ఏర్పా ట్లు చేస్తున్నారు. వీరితో పాటు దీర్ఘకాలిక వ్యాధులున్న వారి ని కూడా గుర్తించి వారికి కూడా చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే, మూడో వేవ్ కూడా వస్తుంద ని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో జిల్లాలోని ఆసుపత్రులను బలోపేతం చేస్తున్నారు. ఈ ఆసుపత్రుల్లో మౌలిక వసతులను కల్పించడంతో పాటు ఆక్సిజన్ బెడ్లు ఉండేవిదంగా సిద్ధం చేస్తున్నారు.
నిత్యం నమోదవుతున్న కొత్త కేసులు
జిల్లాలో సెకండ్ వేవ్ మొదలైన మార్చి నెల నుంచి ఇ ప్పటి వరకు ప్రతీరోజు పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మే మూడో వారం నుంచి కేసుల సంఖ్య తగ్గినా ప్రతీరోజు 10 నుంచి 20 కేసులు నమోదవుతున్నాయి. ఓ వైపు వ్యాక్సినేషన్ కొనసాగుతున్నా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. అవసరాల నిమిత్తం ఎక్కువ మంది బయట కు రావడం.. శుభకార్యాలు, సమావేశాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొంటుడం వల్ల వైరస్ వ్యాప్తి పెరుగుతూ.. కేసులు తగ్గడంలేదు. లాక్డౌన్ ఎత్తివేయడం, వ్యాపార, వాణిజ్య సంస్థలన్నీ తెరిచి ఉంచడం వల్ల పూర్తిస్థాయిలో కేసులు తగ్గడంలేదు. జిల్లాలో ఇప్పటికీ ఒక్కశాతం నుంచి రెండు శాతం మధ్య కేసులు నమోదవుతున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 4 లక్షల 53 వేల 978 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 37 వేల 346 మందికి పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం జిల్లాలో 350కిపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రస్తుతం 78 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. జిల్లాలో సెకండ్ వేవ్ సమయంలో మార్చి చివరి నుంచి మే 2వ వారం వరకు ఆసుపత్రుల్లో బెడ్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత కొంత తగ్గినా.. ఇంకా పలు చోట్ల కేసులు నమోదవుతూనే ఉన్నాయి. పాజిటివ్ వచ్చినవారు చాలా వరకు హోంక్వారంటైన్లోనే ఉంటున్నారు. సీరియస్గా ఉన్నవారు ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్నారు.
3వ తేదీ నుంచి మళ్లీ ఇంటింటి సర్వే
జిల్లాలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో ఆగస్టు 3వ తేదీ నుంచి మ ళ్లీ ఇంటింటి సర్వే చేపట్టాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. కలెక్టర్ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పలుమార్లు వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీ, ఐసీడీఎస్, గ్రామీణాభివృద్ధి అధికారులతో సమావేశాలు నిర్వహించారు. వారం రోజుల పాటు జిల్లాలోని 530 గ్రామాలు, నగర మున్సిపల్ కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీల పరిధిలో సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వేలో కొవిడ్ కేసులను గుర్తించడంతో పాటు వారికి కావాల్సిన మందులను అందించనున్నారు. సీరియస్ గా ఉన్నవారిని ఆసుపత్రికి తరలించనున్నారు. కొవిడ్ లక్షణాలు తక్కువగా ఉన్నవారిని హోంక్వారంటైన్లో ఉంచి మందుల కిట్ను అందించనున్నారు. ఈ సర్వేలో జ్వరాలు వచ్చినవారిని కూడా గుర్తించి వారికి పీహెచ్సీల వారీగా చికిత్స అందిస్తారు. ఈ సర్వేలో కొవిడ్తో పాటు లెప్రసీ, టీ బీ, తలసేమియా వంటి వ్యాధులు ఉన్నవారిని కూడా గుర్తి ంచనున్నారు. వారికి కావాల్సిన మందులను అందించనున్నారు. వారికి చికిత్స అందించడంతో పాటు క్రమం తప్పకుండా మందులు అందేవిధంగా ఏర్పాట్లు చేయనున్నారు. అంతేకాకుండా మూత్ర సంబంధ వ్యాధులతో ఇబ్బందిపడే వారిని కూడా గుర్తించి తగిన చికిత్స అందించనున్నారు. ఫీ వర్ సర్వేలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, ఆశ వర్కర్లు, అం గన్వాడీ టీచర్లు, పంచాయతీ, గ్రామీణాభివృద్ధిశాఖ సిబ్బ ంది పాల్గొననున్నారు. వారం రోజుల పాటు ఇంటింటికీ తి రగడంతో పాటు ఏ రోజుకారోజు సంబంధిత నివేదికను జి ల్లా అధికారులకు అందించనున్నారు. ఆ నివేదిక ఆధారం గా కలెక్టర్ సమీక్షించి తగిన చర్యలు చేపట్టనున్నారు. జిల్లా లో మూడు దఫాలుగా చేపట్టిన ఫీవర్ సర్వే వల్ల కొవిడ్ కే సులు బయటపడడం వల్ల మళ్లీ సర్వే నిర్వహిస్తున్నారు. ముందుగానే కేసులను గుర్తిస్తే ఎక్కువ వ్యాప్తిచెందే అవకా శం ఉండదని అధికారులు పేర్కొంటున్నారు.
చికిత్స కోసం ఏర్పాట్లు
కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గకపోవడం, థర్డ్వేవ్ కూడా వస్తుందన్న వైద్యుల హెచ్చరికలతో అధికారులుకూ డా అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, ఆ ర్మూర్, బోధన్ ఆసుపత్రులతో పాటు కొన్ని పీహెచ్సీలలో చికిత్స కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. మోర్తాడ్, బాల్కొండ పీహెచ్సీల ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉండేవిధంగా చూస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 525 ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉండగా.. యూవీకెన్ సంస్థ మరో 120 బెడ్ల అందించడంతో వాటి సంఖ్య పెరిగిం ది. బోధన్, ఆర్మూర్ ఆసుపతుల్ర్లో వంద చొప్పున బెడ్లను అందుబాటులో ఉంచారు. పీహెచ్సీలలో కూడా సుమారు వంద వరకు బెడ్లను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పా ట్లు చేస్తున్నారు. కేసులు పెరిగినా ఇబ్బందులు లేకుండా చి కిత్స అందించేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
కొవిడ్ కేసులను గుర్తించేందుకే సర్వే
- డాక్టర్ సుదర్శన్, అదనపు డీఎంహెచ్వో
జిల్లాలో కొవిడ్ కేసులను గుర్తించేందుకే ఆగస్టు 3వ తేదీ నుంచి ఫీవర్ సర్వే నిర్వహించనున్నాం. వారం రోజుల పాటు ఇంటింటికీ తిరిగి కొవిడ్తో పాటు ఐదు రకాల వ్యాధులకు సంబంధించినవారిని గుర్తిస్తాం. వారికి చికిత్స అందించడంతో పాటు మందులను కూడా అందిస్తాం. సీరియస్గా ఉన్నవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తాం.
కరోనా కేసులు తగ్గలేదు.. అప్రమత్తంగా ఉండాలి..
డాక్టర్ ప్రతిమరాజ్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్
జిల్లాలో కరోనా కేసులు తగ్గలేదు. ప్రజలు అప్రమత్తం గా ఉండాలి. ప్రస్తుతం జనరల్ ఆసుపత్రిలో 78 మంది చికిత్స పొందుతున్నారు. కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున అందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలి. అవసరం అయితే తప్ప బయటకు రావద్దు. జనరల్ ఆసుపత్రిలో కరోనా వచ్చినవారికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో పాటు మెరుగైన వైద్యం అందిస్తున్నాం.
తగ్గినవారు కూడా అప్రమత్తంగా ఉండాలి..
- డాక్టర్ జలగం తిరుపతిరావు, అసోసియేట్ ప్రొఫెసర్
జిల్లాలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. కరోనా రాకుండా జాగ్రత్తలు పాటించాలి. బయటకు వస్తే మాస్కు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలి. కరోనా వచ్చి తగ్గినవారు జాగ్రత్తగా ఉండాలి. వైద్య నిపుణుల సలహాలు పాటించాలి. తగ్గినవారికి గుండె పోటుతో పాటు ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వైద్యుల సలహాలు ఎప్పటికప్పుడు పాటిస్తూ మందులు వాడాలి.