ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహం కాదు: సుప్రీం

ABN , First Publish Date - 2021-03-03T19:13:47+05:30 IST

ఆర్టికల్ 370 నిర్వీర్యం అనంతరం జమ్మూ కశ్మీర్‌లోని చాలా మంది నేతలు ఏడాదికి పైగా నిర్బంధంలో ఉన్నారు. ఆర్టికల్ 370 తొలగించిన అనంతరం ఆ రాష్ట్రాన్ని..

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహం కాదు: సుప్రీం

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫారూఖ్ అబ్దుల్లాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తనపై దేశద్రోహం కేసు మోపి అరెస్ట్ చేయాలంటూ వేసిన పిటిషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం తప్పు పట్టింది. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడటం తప్పు కాదని, ప్రభుత్వాలకు భిన్నమైన రీతిలో స్పందించవచ్చని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ మేమంత్ గుప్తాలతో కూడిన ధర్మాసనం బుధవారం పేర్కొంది. అంతే కాకుండా పిటిషన్ వేసిన వారిని 50 వేల రూపాయలు డిపాజిట్ చేయాలని ఆదేశించింది.


జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 నిర్వీర్యాన్ని నిరసిస్తూ.. మళ్లీ ఆ అధికారం పొందేందుకు అవసరమైతే చైనా, పాకిస్తాన్ దేశాల సహాయం తీసుకుంటామంటూ ఫారూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యానించారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలు దేశ వ్యతిరేకమైన వ్యాఖ్యలని, దేశ సమగ్రతను దెబ్బతీస్తాయని రజత్ శర్మ, నేహ్ శ్రీవాస్తవలు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌లో ఫారుఖ్ పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయాలని, దేశద్రోహం కింద కేసులు నమోదు చేయాలని, ఐపీసీలోని సెక్షన్ 124-ఏ కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


దీనిపై సుప్రీం ఘాటుగానే స్పందించింది. ‘‘ప్రభుత్వాలకు భిన్నంగా, వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయొచ్చు. దీనిని దేశద్రోహంగా ఎలా పరిగణిస్తాం. ప్రభుత్వాలపై చేసే వ్యాఖ్యలు దేశద్రోహం కిందకు రావు. అవి భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగమే’’ అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.


ఆర్టికల్ 370 నిర్వీర్యం అనంతరం జమ్మూ కశ్మీర్‌లోని చాలా మంది నేతలు ఏడాదికి పైగా నిర్బంధంలో ఉన్నారు. ఆర్టికల్ 370 తొలగించిన అనంతరం ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా కేంద్రం విభజించింది. అయితే ఒక భాగమైన జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఉంటుందని, మరొక భాగమైన లదాఖ్ పూర్తిస్థాయి కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుందని కేంద్రం పేర్కొంది. ఇక జమ్మూ కశ్మీర్‌కు కూడా వీలైనంత తొందరలో రాష్ట్రహోదా కల్పిస్తామని పార్లమెంట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.

Updated Date - 2021-03-03T19:13:47+05:30 IST