బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన సంజయ్ ఝా!

ABN , First Publish Date - 2020-10-30T03:38:45+05:30 IST

కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి సంజయ్ ఝా బీజేపీలో చేరబోతున్నారంటూ జోరందుకున్న ప్రచారానికి కొద్దిగంటల్లోనే ఫుల్‌స్టాప్ పడిపోయింది...

బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన సంజయ్ ఝా!

న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి సంజయ్ ఝా బీజేపీలో చేరబోతున్నారంటూ జోరందుకున్న ప్రచారానికి కొద్దిగంటల్లోనే ఫుల్‌స్టాప్ పడిపోయింది. ఇవాళ సాయంత్రం ఓ ప్రకటన చేయబోతున్నానంటూ ప్రకటించిన ఝా.. ఎట్టకేలకు అసలు విషయం చెప్పేశారు. తాను రచించిన ‘‘ది గ్రేట్ అన్‌రావలింగ్: ఇండియా ఆఫ్టర్ 2014’’ పుస్తకాన్ని ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. ట్విటర్ వేదికగా ఆయన స్పందిస్తూ... ‘‘నా తదపరి పుస్తకం‘ది గ్రేట్ అన్‌రావలింగ్ (ఇండియా ఆఫ్టర్ 2014) డిసెంబర్ 2020లో విడుదల కానుందని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాను. దీనికోసం కార్తిక వీకే, అజిత జీఎస్ లాంటి గొప్ప సంపాదకులతోనూ, అద్భుతమైన పబ్లిషర్ వెస్ట్‌ల్యాండ్ బుక్స్‌తో నూ కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను...’’ అని పేర్కొన్నారు. కాగా దీనికంటే ముందు ఆయన మరో ట్వీట్‌లో స్పందిస్తూ.. ‘‘హాయ్ ఫ్రెండ్.. నేను ఇవాళ సాయంత్రం మీకు ఓ ముఖ్యమైన ప్రకటన చేయాలనుకుంటున్నాను..’’ అని పేర్కొన్నారు. దీంతో నెటిజన్లు అత్యంత ఆసక్తితో ఆయన ప్రకటన కోసం ఎదురుచూశారు. మరికొంత మంది ఏకంగా ఆయన బీజేపీలో లేదా శివసేనలో చేరబోతున్నారంటూ ప్రచారం మొదలు పెట్టారు. అయితే ఆయన తాను చెప్పదల్చుకున్నది చెప్పేయడంతో ఇక ఈ ప్రచారానికి తెరపడినట్టైంది.  కాగా పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారనీ, క్రమశిక్షణ ఉల్లంఘించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ అధిష్టానం జూలైలో ఝాను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. 

Updated Date - 2020-10-30T03:38:45+05:30 IST