ఆర్వోబీ కలేనా..!
ABN , First Publish Date - 2021-06-24T05:50:02+05:30 IST
ఉభయ గోదావరి జిల్లాల ప్రయాణికుల కల నిడదవోలులో ఆర్వోబీ నిర్మాణం.
నిడదవోలులో నేటికీ ప్రారంభం కాని రాష్ట్ర ప్రభుత్వ పనులు
తుది దశకు రైల్వే శాఖ పనులు
అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు పైలాన్ ఆవిష్కరణ
నిడదవోలు, జూన్ 23 : ఉభయ గోదావరి జిల్లాల ప్రయాణికుల కల నిడదవోలులో ఆర్వోబీ నిర్మాణం. పశ్చిమ నుంచి తూర్పు గోదావరికి, తూర్పు నుంచి పశ్చిమ, కృష్ణా జిల్లాలకు ప్రయాణించే వాహనదారులు నిడదవోలు రైల్వేగేటు పేరు చెబితే హడలిపోతారు. దీనికి ప్రధాన కారణం ఎండనకా వాననక గంట ల తరబడి రైల్వే గేటు వద్ద నిరీక్షించవలసి రావడం. ఈ సమస్యకు పరిష్కా రంగా అప్పటి టీడీపీ హయాంలో నాటి సీఎం చంద్రబాబునాయుడు ప్రజల సమక్షంలో ఆర్వోబీ నిర్మాణానికి హామీ ఇచ్చారు. 2019 జనవరి 7న నిడదవోలు పట్టణ నడిబొడ్డులో పైలాన్ను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈలోపు ఎన్ని కలు వచ్చి వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమై 25 శాతం పూర్తికాని పనులను నిలుపుదల చేసిన జాబితాలో నిడదవోలు ఆర్వోబీ ఉంది. అప్పటికే రైల్వే విభాగానికి సంబం ధించిన పనులు ప్రారంభమయ్యాయి. నేటికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పనులు ప్రారంభం కాకపోగా కేంద్ర రైల్వే శాఖకు చెందిన పనులు తుది దశకు చేరుకున్నాయి.
రూ.201 కోట్లు ప్రతిపాదనలు
గత ప్రభుత్వ హయాంలో ఆర్వోబీ నిర్మాణానికి మొత్తం రూ.201 కోట్లు అవసరమని ప్రతిపాదించి జీవో విడుదల చేశారు. దీనిలో రూ.21 కోట్లు భూసే కరణ తదితర అంశాలకు కేటాయించగా మిగిలిన రూ.180 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ.90 కోట్లు, కేంద్ర రైల్వే శాఖ 90 కోట్లు కేటాయించాల్సి ఉంది. కేంద్ర రైల్వే శాఖ రూ.56 కోట్లు మాత్రమే కేటాయించేందుకు ముందుకు రాగా మిగిలిన నిధులను రాష్ట్ర ప్రభుత్వమే భరించి గోదావరి జిల్లాల వాహనదారుల సమస్యను పరిష్కరించేందుకు నడుం బిగించింది.
ముందుకు సాగని భూ సేకరణ
ప్రత్తిపాడు నుంచి నిడదవోలు వచ్చే రహదారిలో 16/240 కిలోమీటర్ల వద్ద రైల్వే లైను 556/15–17 కిలో మీటర్ల నిడదవోలు లెవెల్ క్రాసింగ్ నెం.381 వద్ద నిర్మించనున్న మూడు ఆర్మ్ల ఆర్వోబీ నిర్మాణానికి నూతన కేంద్ర చట్టం ప్రకారం గతంలోనే శ్రీకారం చుట్టారు. దీనిపై అప్పటి జేసీ ఆధ్వర్యంలో భూసే కరణ పరిహారం చెల్లింపుపై స్థల, భవన యజమానులతో సమావేశం నిర్వ హించారు. భూ సేకరణకు సంబంధించి తుది జాబితాను విడుదల చేశారు. అయితే నేటికీ భూ సేకరణకు అడుగు ముందుకు పడలేదు.
నిత్యం రైళ్ల రాకపోకల రద్దీ..
నిడదవోలు రైల్వే గేటు మీదుగా ప్రతిరోజూ హౌరా టు చెన్నై మెయిన్ లైన్లో సుమారు 150 రైళ్ల వరకు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రస్తుతం కరోనా కారణంగా కొన్ని రైళ్లు తగ్గినప్పటికీ ప్రతి పది నిమిషాలకు ఒకసారి రైల్వే గేటు పడి 20 నుంచి 30 నిమిషాలకుపైగా వాహనదారులు వేచి చూడాల్సిన పరిస్థితి. మరోపక్క బ్రాంచి లైను డబుల్ లైనుగా విస్తరిస్తున్నారు. భవిష్యత్లో మరింతగా రైళ్ల రాకపోకల రద్దీ పెరిగే అవకాశం ఉంది.