గాంధీని దూషించినందుకు పశ్చాత్తాపం లేదు: FIR అనంతరం సాధువు

ABN , First Publish Date - 2021-12-28T18:41:16+05:30 IST

గాంధీ నిరాహారదీక్షలన్నీ హిందువులకు వ్యతిరేకంగా చేసినవే. విభజన జరిగినప్పుడు 27 లక్షల మంది హిందువులు చనిపోయారు. గాంధీ జాతి పిత ఎంత మాత్రమూ కాదు. ఆయన రాజవంశం నుంచి వచ్చారు. ఆయన రాజవంశ పిత. ఒకవేళ జాతిపితగా ప్రకటించాల్సి వస్తే పటేల్‌ను ప్రకటించాలి..

గాంధీని దూషించినందుకు పశ్చాత్తాపం లేదు: FIR అనంతరం సాధువు

రాయ్‌పూర్: మహాత్మ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాయ్‌పూర్‌కి చెందిన కాళీచరణ్ అనే సాధువుపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. అయితే గాంధీని దూషించడం పట్ల తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని, గాంధీని జాతి పితగా వర్ణించడం తాను ఎంత మాత్రం ఒప్పుకోనని అతడు అన్నాడు. డిసెంబర్ 26న జరిగిన ఓ కార్యక్రమంలో మహాత్మాగాంధీని చంపడం సరైందేనని, అందుకు గాడ్సేకి నమస్కారాలు చేస్తున్నట్లు కాళీచరణ్ అనే సాధువు వ్యాఖ్యానించాడు. అంతే కాకుండా గాంధీని అనుచిత వ్యాఖ్యలతో దూషించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాళీచరణ్‌పై కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.


అనంతరం మరొక వీడియోను కాళీచరణ్ విడుదల చేశాడు. ఆ వీడియాలో ‘‘గాంధీని దూషించినందుకు నాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గాంధీని దూషించడంలో నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి. ఈ దేశానికి సర్దార్ పటేల్ ప్రధానమంత్రి కాకుండా అడ్డుకున్నది గాంధీనే. ఆయన వల్లే నెహ్రూ ప్రధానమంత్రి అయ్యారు. పటేల్ ప్రధాని అయ్యుంటే భారత్ ప్రపంచ గురువుగా ఉండేది. గాంధీ ఈ ద్రోహం చేశారు. అందుకే నా గుండెల్లో గాంధీ పట్ల అసహ్యం ఉంది. దేశ విభజనకు గాంధీ ఉప్పందించారు. గాంధీ నిరాహారదీక్షలన్నీ హిందువులకు వ్యతిరేకంగా చేసినవే. విభజన జరిగినప్పుడు 27 లక్షల మంది హిందువులు చనిపోయారు. గాంధీ జాతి పిత ఎంత మాత్రమూ కాదు. ఆయన రాజవంశం నుంచి వచ్చారు. ఆయన రాజవంశ పిత. ఒకవేళ జాతిపితగా ప్రకటించాల్సి వస్తే పటేల్‌ను ప్రకటించాలి’’ అని కాళీచరణ్ చెప్పుకొచ్చాడు.

Updated Date - 2021-12-28T18:41:16+05:30 IST