ఇంటింటి సర్వే కాదు, ఇంటింటికీ వైద్యం కావాలి!
ABN , First Publish Date - 2020-04-02T05:42:31+05:30 IST
కరోనా వైరస్ విపత్తు నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు గ్రామ వలంటీర్ల ద్వారా ఇంటింటికీ తిరిగి ఆరోగ్య వివరాలు సేకరించటం, కరోనా వైరస్పై అవగాహన కల్పించటం వంటి చర్యలు...
కరోనా వైరస్ విపత్తు నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు గ్రామ వలంటీర్ల ద్వారా ఇంటింటికీ తిరిగి ఆరోగ్య వివరాలు సేకరించటం, కరోనా వైరస్పై అవగాహన కల్పించటం వంటి చర్యలు చేపడుతున్నాయి. అయితే ఈ చర్యల వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదు. పైగా చాలా ప్రాంతాలలో ఈ వలంటీర్ల వ్యవస్థ సరిగా పనిచేయటం లేదు. దీనికంటే- గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ ఇంటింటికీ సంచార వైద్య బృందాలను పంపి, ప్రజల వైద్య అవసరాలను తీరిస్తే అది ఈ విపత్కాలంలో మరింత ఉపయుక్తంగా ఉంటుంది. పేదలు,వృద్ధులు తక్షణ వైద్యం అందక నానా అగచాట్లు పడుతున్నారు. ఈ సంచార వైద్య బృందాలు అక్కడికక్కడే తీరే వైద్య అవసరాలేమైనా ఉంటే తీర్చగలవు. ఒకవేళ ఎవరికైనా తక్షణ వైద్య అవసరం ఉంటే వెంటనే జిల్లా ఆసుపత్రులకు కూడా తరలించగలవు. కేవలం సరైన పరీక్షా వ్యవస్థ లేకపోవటం వలన బయటపడని కరోనా కేసులు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఉన్నాయని వాదనలు వస్తున్న నేపథ్యంలో ఈ చర్య ఎంతో ముఖ్యం. ఇది వాస్తవ పరిస్థితిని నిగ్గు తేలుస్తుంది. అంతేకాదు ప్రజల్లో ఆందోళనను కూడా చాలావరకూ తగ్గిస్తుంది. ప్రజలు ఇళ్ళనుంచి బైటకురావాల్సిన అవసరాన్ని మరికొంత తగ్గిస్తుంది.
గరిమెళ్ళ రామకృష్ణ, ఏలూరు