హాల్టికెట్ల టెన్షన్! ఆందోళనలో విద్యార్థులు
ABN , First Publish Date - 2022-05-16T17:20:56+05:30 IST
పదో తరగతి విద్యార్థులకు ఇప్పటికే హాల్టికెట్లు జారీ చేశారు. కానీ, కొన్ని ప్రైవేట్ పాఠశాలలోని విద్యార్థులకు ఇంకా హాల్టికెట్లు అందకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. పరీక్షల తేదీ దగ్గర పడుతున్నప్పటికీ హాల్టికెట్ల జారీపై పలు ప్రైవేట్..
ఈటీఆర్, లేకుండానే తరగతులు
అప్లోడ్ కాని ఇంటర్నల్ మార్కులు
హైదరాబాద్ సిటీ, మే 15 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి(Tenth grade) విద్యార్థులకు ఇప్పటికే హాల్టికెట్లు జారీ చేశారు. కానీ, కొన్ని ప్రైవేట్ పాఠశాలలోని విద్యార్థులకు ఇంకా హాల్టికెట్లు(Hall tickets) అందకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. పరీక్షల తేదీ దగ్గర పడుతున్నప్పటికీ హాల్టికెట్ల జారీపై పలు ప్రైవేట్ స్కూళ్ల నిర్వాహకులు(Administrators of private schools) నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు.
ఎందుకీ సమస్య
ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ప్రతీ రెండేళ్లకోసారి తమ గుర్తింపును పొడిగించుకోవాలి. ఇందుకోసం ఎక్స్టెన్షన్ ఆఫ్ టెంపరరీ రికగ్నైజేషన్ (ఈటీఆర్) కోసం జిల్లా విద్యాశాఖకు దరఖాస్తు చేసుకోవాలి. భవనం, అగ్నిమాపక, వాటర్బోర్డుతో పాటు 23 శాఖల అనుమతి పత్రాలను పరిశీలించిన తర్వాత ఈటీఆర్ను జారీ చేస్తుంటారు. కరోనా కారణంగా జిల్లాలోని 2,334 ప్రైవేట్ స్కూళ్లలో 448 మూతపడ్డాయి. ఇందులో 95 శాతం బడ్జెట్ బడులుండగా, 5శాతం టెక్నో స్కూళ్లు ఉన్నాయి. మూతపడిన పాఠశాలల్లోని విద్యార్థులను కొంతమంది ఇతర స్కూళ్లకు బదిలీ చేయగా, మరి కొందరు ఈటీఆర్ అనుమతులు తీసుకోకుండానే పాఠశాలల్లో అడ్మిషన్లు నడిపిస్తున్నారు. ప్రస్తుతం ఆయా స్కూళ్లలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈటీఆర్ లేకపోవడంతో ఆయా పాఠశాలల్లోని విద్యార్థులకు హాల్టికెట్లు జారీ కావడం లేదు. ఇంటర్నల్ మార్కులు సైతం అప్లోడ్ కావడం లేదు.
స్పెషల్ పర్మిషన్ కోసం పరుగులు
జిల్లాలో ఈటీఆర్లేని పాఠశాలలు దాదాపు 120 వరకు ఉన్నాయి. దీంతో ఆయా యజమానులు ఈటీఆర్ చేయించుకు నేందుకు నగరంలోని డైరెక్టరేట్ ఆఫ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (డీఎ్సఈ), రీజినల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) కార్యాలయాలకు వెళ్తున్నారు. పదో తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకుని స్పెషల్ పర్మిషన్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని నామినల్ రోల్స్ను ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటీవల సైదాబాద్ మండలానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న 12 మంది విద్యార్థులు హాల్టికెట్ల కోసం నిర్వాహకులను అడిగితే ఇంకా రాలేదని సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. పరీక్షలు సమీపిస్తున్న ఎందుకు ఇవ్వడంలేదని తల్లిదండ్రులు గట్టిగా నిలదీస్తే ఈటీఆర్ లేదని వారు చెప్పినట్లు సమాచారం.