ప్రభుత్వానివి నామమాత్ర చర్యలు

ABN , First Publish Date - 2020-11-29T05:23:00+05:30 IST

వరదలతో బాధపడుతున్న ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం నామమాత్రపు చర్యలు తీసుకుంటోందని టీడీపీ సిటీ ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి విమర్శించారు.

ప్రభుత్వానివి నామమాత్ర చర్యలు
ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి

వారధి తొలగించిన వారిపై కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలి

ముంపు ప్రాంతాలను పరిశీలించిన కోటంరెడ్డి

నెల్లూరు(వ్యవసాయం), నవంబరు 28 : వరదలతో బాధపడుతున్న ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం నామమాత్రపు చర్యలు తీసుకుంటోందని టీడీపీ  సిటీ ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి  విమర్శించారు. వరద ముంపునకు గురైన నెల్లూరులోని వెంకటేశ్వరపురం, జనార్దనరెడ్డికాలని, భగత్‌సింగ్‌కాలనీ, ఇస్లాంపేట ప్రాంతాల్లో ఆయన శనివారం పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వలంటీర్లు వచ్చి ఒక ఇంట్లో  ఐదుగురు ఉంటే కొంచెం ఉప్మా పెట్టి సర్దుకోమని  చెరప్పడం ఏమిటని ప్రశ్నించారు. వారం ముందు తుఫాన్‌ ఉందని తెలిసి ఎలాంటి సమాచారం లేకుండా సోమశిల జలాశయం నుంచి నీరు వదలడంతో ఈప్రాంతంలో 1500 ఇళ్లు మునిగిపోయాయన్నారు. ఎన్నికలప్పుడు ఓట్లకోసం ఇంటింటికి తిరిగినట్లు  మంత్రి అనిల్‌ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న వారికి రూ.500లు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. మరో రూ.వంద వేసి ముఖ్యమంత్రికే ఇస్తామని ఇక్కడి ప్రజలు చెబుతున్నారని విమర్శించారు. వెంకటేశ్వరపురం, జనార్ధనరెడ్డికాలనీ మధ్య ఉన్న వారధిని ఏశాఖ అధికారులు తొలగించారో, ఏ ఉద్దేశంతో ఆ పనిచేశారో తెలుసుకుని వారిపై కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో  టీడీపీ నాయకులు ధర్మవరపు సుబ్బారావు, జహీర్‌, హనుమంతు, సుధ, నాగేంద్ర, సుఖేష్‌, సుభాన్‌  పాల్గొన్నారు.



Updated Date - 2020-11-29T05:23:00+05:30 IST