రాజ్యసభకు సంచార జాతులు

ABN , First Publish Date - 2021-11-26T05:54:46+05:30 IST

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న 119 స్థానాలను చూస్తే ఎస్సీ 19, ఎస్టీ 12, ఎంఐఎం నుండి మైనార్టీ ఎమ్మెల్యేలు ఏడుగురున్నారు. రెడ్డి, వెలమ, కమ్మ సామాజిక వర్గాలు కలిపి 53 మంది ఎమ్మెల్యేలున్నారు...

రాజ్యసభకు సంచార జాతులు

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న 119 స్థానాలను చూస్తే ఎస్సీ 19, ఎస్టీ 12, ఎంఐఎం నుండి మైనార్టీ ఎమ్మెల్యేలు ఏడుగురున్నారు. రెడ్డి, వెలమ, కమ్మ సామాజిక వర్గాలు కలిపి 53 మంది ఎమ్మెల్యేలున్నారు. బీసీ ఎమ్మెల్యేలు కేవలం 23 మంది మాత్రమే ఉన్నారు. శాసనమండలిలోనూ సింహభాగం అగ్రకులాలాకు చెందినవారే ఉన్నారు. ఇటీవల టిఆర్‌ఎస్‌ ప్రకటించిన 19 మండలి స్థానాల్లో ఎస్సీ ఒకరు మాత్రమే. ఒక్క ఎస్టీ లేరు. బీసీ అభ్యర్థులు కేవలం ముగ్గురు మాత్రమే. అంటే మండలిలో కూడా రాజకీయ, ఆర్థిక పలుకుబడి గల వారికే అవకాశం ఇచ్చారు. అసెంబ్లీలో, మండలిలో, పార్లమెంట్ ఉభయ సభలలో అత్తెసరు సంఖ్యలో ఉన్న బీసీ ప్రజాప్రతినిధుల్లో బలమున్న కులాల వారినే ఎంపిక చేశారు. 90 శాతం అవకాశం దక్కని కులాలు అనేకంగా ఉన్నాయి. బీసీ కులాలు రాష్ట్రంలో 140 ఉంటే ఒక్క బీసీ–ఏ లోనే 54 కులాలున్నాయి. బీసీ–బీ నుంచి 28, బిసి–డీ నుంచి 47 కులాలుండగా ఇందులో ఐదారు కులాలకు మాత్రమే చట్ట సభల్లో ప్రాతినిధ్యం లభిస్తుండడం తీరని ఆశనిపాతమైన అంశం. అందుకే ఇప్పటికైనా రాజ్యసభకు సంచార జాతి బిడ్డలను పంపాల్సిన అవసరం ఉన్నది. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడిన సంచార జాతులు, ఎంబీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించాలని తలపోస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ దిశగా ఆలోచన చేస్తారనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం కుల వృత్తులతో ఉద్యమంలో ముందున్న సంచార జాతులు ఇప్పుడు తెలంగాణలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ జాతుల నుంచి మేధావులు, విద్యావంతులూ పలువురు ఉన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలహీనంగా ఉన్న నేపథ్యంలో చట్టసభల్లో నేరుగా పోటీ చేసే అవకాశాలు లేని క్రమంలో పెద్దల సభలకు సిఫారసు చేయాల్సిన అవసరం ఉంది. గతంలో కేసీఆర్ సిఎం హోదాలో ఈ జాతులకు హామీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కనీసం రాజ్యసభకు సంచార జాతుల విద్యాధికులను సిఫారసు చేయాల్సిన బాధ్యతను గుర్తు చేస్తున్నారు.

వెంకట్ గుంటిపల్లి

Updated Date - 2021-11-26T05:54:46+05:30 IST