సాగరతీరంలో సందడే సందడి..

ABN , First Publish Date - 2022-01-17T06:30:28+05:30 IST

సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా శని, ఆదివారాలు సందర్శకులతో సాగరతీరం కళకళలాడింది.

సాగరతీరంలో సందడే సందడి..
రంగులరాట్నం ఎక్కిన సందర్శకులు

పండుగల సందర్భంగా తరలివచ్చిన జనం

బీచ్‌ రోడ్డు, జనవరి 16: సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా శని, ఆదివారాలు సందర్శకులతో సాగరతీరం కళకళలాడింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన జనంతో తీరంలో సందడి వాతావరణం నెలకొంది. పలువురు బీచ్‌లో సరదాగా జలకాలాడుతూ ఉల్లాసంగా..ఉత్సాహంగా గడపగా, ఇంకొందరు ఇసుకతిన్నెలపై కూర్చుని ముచ్చట్లాడుకుంటూ గడిపారు. మరికొందరు పిల్లలతో పాటు ఆనందంగా గాలిపటాలు ఎగురవేశారు. కాగా పల్లెల్లో తీర్థాలలో మాదిరిగా ఆదివారం తీరంలో రంగులరాట్నం ఏర్పాటు చేయడంతో చిన్నారులతో పాటు పలువురు పెద్దలు కూడా సరదాగా ఎక్కారు. నగరవాసులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఇటు వైఎంసీఏ నుంచి అటు కోస్టల్‌ బ్యాటరీ వరకు తీరం జనసంద్రంగా మారింది. కాగా పార్కు హోటల్‌ రోడ్డంతా ఫుడ్‌ కోర్టులతో రద్దీగా కనిపించింది. విద్యుద్దీప కాంతులతో ‘కురుసుర’ కనువిందు చేసింది.

భీమునిపట్నం: సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా శని, ఆదివారం భీమిలి బీచ్‌ సందర్శకులతో కిటకిట లాడింది. మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి వరకు తీరమంతా సందడిగా కనిపించింది. పలువురు కెరటాల్లో కేరింతలు కొట్టగా, మరికొందరు ఇసుకతిన్నెలపై ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ ఆనందంగా గడిపారు. అలాగే శ్రీలక్ష్మీనృసింహస్వామిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. చాలామంది సౌమ్యగిరిపై భాగాన వున్న పావురాలకొండ బౌద్ధ క్షేత్రాన్ని కూడా సందర్శించారు. 




Updated Date - 2022-01-17T06:30:28+05:30 IST