ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం... సెక్యూరిటీగార్డు సజీవ దహనం
ABN , First Publish Date - 2020-08-10T17:15:04+05:30 IST
దేశరాజధాని ఢిల్లీకి సమీపంలోని నోయిడా సెక్టార్ -63లోని ఒక కర్మాగారంలో ఈరోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీకి సమీపంలోని నోయిడా సెక్టార్ -63లోని ఒక కర్మాగారంలో ఈరోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒక సెక్యూరిటీ గార్డు సజీవదహనమయ్యాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపుచేసింది. అయితే అప్పటికే సెక్యూరిటీ గార్డు సజీవదహనమైపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాల్ పెన్ తయారీ కర్మాగారంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే 13 అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని, దాదాపు మూడు గంటల పాటు ప్రయత్నంచి, మంటలను అదుపుచేశాయి. ఈ ఘటనలో సఫీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న గార్డు సందీప్ కుమార్ (23) సజీవ దహనమయ్యాడు. కాగా ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది.