ఫ్రెంచ్‌ రచయిత్రికి సాహిత్య నోబెల్‌

ABN , First Publish Date - 2022-10-07T09:12:00+05:30 IST

స్వీయ జీవితాన్ని.. తన చుట్టూ ఉండేవారి జీవితాలను ఆధారంగా చేసుకుని యూరప్‌ మహిళల వేదనను అక్షరబద్ధం చేసిన ఫ్రెంచ్‌ రచయిత్రియానీ ఎర్నో (82) 2022 సంవత్సరానికిగాను సాహిత్య నోబెల్‌ పురస్కారానికి ఎంపికయ్యారు.

ఫ్రెంచ్‌ రచయిత్రికి సాహిత్య నోబెల్‌

యూరప్‌ మహిళల సమస్యలను అక్షరబద్ధం చేసిన యానీ అర్నో..  జీవిత అనుభవాలే ముడిసరుకు


స్టాక్‌హోం, అక్టోబరు 6: స్వీయ జీవితాన్ని.. తన చుట్టూ ఉండేవారి జీవితాలను ఆధారంగా చేసుకుని యూరప్‌ మహిళల వేదనను అక్షరబద్ధం చేసిన ఫ్రెంచ్‌ రచయిత్రియానీ ఎర్నో (82) 2022 సంవత్సరానికిగాను సాహిత్య నోబెల్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. సరళమైన భాషలో ఎక్కడా రాజీ పడని విధంగా, ధైర్యంగా రచనలు చేసినందుకు ఆమెను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు స్వీడిష్‌ అకాడమీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకూ 16 మంది మహిళలు సాహిత్య నోబెల్‌ పురస్కారాన్ని అందుకున్నారు. వారి సరసన 17వ మహిళగా నిలవనున్న యానీ అర్నో.. 1940 సెప్టెంబరు 1న నార్మండీలోని ఇవటోలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు కిరాణా-కాఫీ దుకాణం నిర్వహించేవారు. అర్నో వ్యక్తిత్వం.. ఉన్నత భావాలతో రూపుదిద్దుకుంది. 1971లో ఆధునిక సాహిత్యంలో పట్టభద్రురాలైన ఆమె తొలినాళ్లలో పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేస్తూ రచనా వ్యాసంగాన్ని ప్రారంభించారు. 1974లో రాసిన ‘లెస్‌ ఆర్మోయిరెస్‌ విడెస్‌ (క్లీన్‌డ్‌ అవుట్‌)’.. ఆమె తొలి రచన. అది ఆమె ఆత్మ కథ. కాకపోతే నవలారూపంలో రాశారు. తర్వాత కొంతకాలంపాటు కమర్షియల్‌ రచనలు చేసినా.. క్రమంగా తన కుటుంబసభ్యుల, సన్నిహితులు, చుట్టుపక్కల ఉండేవారి జీవితాలనే రచనల్లో అక్షరబద్ధం చేశారు. దాదాపు ఐదు దశాబ్దాల రచనా వ్యాసంగంలో ఆమె ఆమె రాసింది దాదాపు 30 పుస్తకాల లోపే. కానీ, నాటి యూరోపియన్‌ మహిళలు ఎదుర్కొన్న రకరకాల సమస్యల గురించి ఎలాంటి దాపరికం లేకుండా చాలా గట్టిగా ప్రపంచానికి చాటి చెప్పారు. ఆ ధైర్యానికే మెచ్చి స్వీడిష్‌ కమిటీ ఆమెను ఇలా గౌరవించింది.

Updated Date - 2022-10-07T09:12:00+05:30 IST