నీరు లేని పుష్కరం
ABN , First Publish Date - 2020-11-22T05:44:51+05:30 IST
తుంగభద్ర పుష్కరాలకు నదిలో నీరు లేకుండా పోయింది.
- ప్రభుత్వ నిర్లక్ష్యంపై భక్తుల ఆగ్రహం
- అధికారుల సూచన పట్టని పాలకులు
కర్నూలు(అగ్రికల్చర్), నవంబరు 21: తుంగభద్ర పుష్కరాలకు నదిలో నీరు లేకుండా పోయింది. ఇరిగేషన్ అధికారులు ముందుగానే నివేదిక ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. తుంగభద్ర డ్యాం నుంచి 8 టీఎంసీల నీటిని విడుదల చేయించాలని ఈ నెల 9న ప్రభుత్వానికి ఇరిగేషన్ అధికారులు లేఖ రాశారు. కానీ స్పందన రాలేదు. ఇంతలోగా పుష్కరాలు సమీపించాయి. నదిలో నీరు లేకపోవడంతో వారు ఆందోళన చెందారు. కనీసం రెండున్న టీఎంసీల నీటిని విడుదల చేయించాలని రెండోసారి కోరారు. దీనికి మూడు రోజుల క్రితమే అనుమతి వచ్చింది. దీంతో జలాశయం నుంచి గురువారం 3 వేల క్యూసెక్కుల నీరు నదిలోకి వదిలారు. ఈ నీరు ఆర్డీఎస్ను దాటుకుని సుంకేసులకి చేరాలంటే కనీసం 5 రోజులు పడుతుంది. ఆ లోగా పుష్కరాలు ముగింపు దశకు చేరుతాయి.
సీఎం వచ్చినప్పుడూ అంతే..
పుష్కరాలను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం కర్నూలుకు వచ్చారు. సంకల్బాగ్ వద్ద నదిలో పూజలు నిర్వహించి వేడుకలను ప్రారంభించారు. ఆ సమయంలో కూడా నదిలో తగినంత నీరు కనిపించలేదు. సుంకేసుల జలాశయం నుంచి 6,600 క్యూసెక్కుల నీటిని గురువారం రాత్రే విడుదల చేశామని నీటి పారుదల శాఖ అధికారులు ప్రకటించారు. కానీ ఆ స్థాయిలో ప్రవాహం లేదని భక్తులు అంటున్నారు. ముఖ్యమంత్రి వెళ్లిపోగానే 4,400 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కర్నూలు తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నదిలోకి ఎక్కువ నీరు వదలడం లేదని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.