హైదరాబాద్లో పేదలకు అందని వ్యాక్సిన్!
ABN , First Publish Date - 2021-05-08T17:00:06+05:30 IST
పేదలకు అందుబాటులో ఉండడం లేదని
హైదరాబాద్/రాంగోపాల్పేట్ : ఆన్లైన్ బుకింగ్ వల్ల కరోనా టీకాలు పేదలకు అందుబాటులో ఉండడం లేదని, అందరికీ వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ చీర సుచిత్ర ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం ఆమె నల్లగుట్ట చుట్టాల బస్తీ, మినిస్టర్ రోడ్డులోని పౌల్ డోస్, పాన్బజార్లోని నాగెల్లి దుర్గయ్య పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. కరోనా టీకా కోసం ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలని ప్రభుత్వం నిబంధన పెట్టడంతో పేదలు, నిరక్షరాస్యులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆరోగ్య కేంద్రాలకు ఆధార్ కార్డు తీసుకొని నేరుగా వచ్చిన వారందరికీ వ్యాక్సిన్ వేయాలని డిమాండ్ చేశారు. మొదటి డోసు తీసుకుని 45 రోజులు అవుతున్నా రెండో డోసు వేయించుకోలేక కొంతమంది ఆందోళన చెందుతున్నారన్నారు. 24 గంటల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలు ఇవ్వాలన్నారు. పోలీసులు మాస్కులేని వారికి అవగాహన కల్పించడం మానేసి టార్గెట్ల కోసం వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్నారని అన్నారు. సమస్యలను రాష్ట్ర మంత్రి శ్రీనివాస్యాదవ్, కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి దృష్టికి తీసుకెళతానని కార్పొరేటర్ తెలిపారు.