షా, భాగవత్ కాళ్లను ఏ తమిళుడూ తాకాలనుకోడు: రాహుల్

ABN , First Publish Date - 2021-03-29T00:07:23+05:30 IST

స్టాలిన్ ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి. నేను దీనికి గ్యారెంటీ ఇస్తున్నాను. ఇది లాంఛనమే అయినప్పటికీ ఎన్నికల ప్రక్రియ ఉంది. అయితే దీన్ని అంత సులువుగా తీసుకోకూడదు. పోరాటం ఇంకా మిగిలే ఉంది.

షా, భాగవత్ కాళ్లను ఏ తమిళుడూ తాకాలనుకోడు: రాహుల్

చెన్నై: అమిత్ షా, మోహన్ భాగవత్ లాంటి వ్యక్తుల కాళ్లు తాకడానికి ఏ తమిళుడూ ఇష్టపడడని, కానీ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి వారి ముందు మోకరిల్లాల్సి వస్తోందని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ అన్నారు. నిజానికి పళనిస్వామికి ఇష్టం లేకపోయినప్పటికీ ఆర్ఎస్ఎస్, అమిత్ షాలు సీబీఐ, ఈడీలను ఉసిగొలిపి తమ కాళ్ల వద్దకు తెచ్చుకుంటున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్రంలోని సేలంలో డీఎంకే-కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభకు రాహుల్ హాజరై ప్రసంగించారు.


‘‘ముఖ్యమంత్రి పళనిస్వామి అమిత్ షా, మోహన్ భాగవత్‌లకు మోకరిల్లారు. ఏ తమిళుడూ వారి కాళ్లు తాకాలని అనుకోడు. పళనిస్వామికి కూడా వారికి లొంగిపోవడం ఇష్టం లేదు. కానీ ఆయన అవినీతి చేయడం వల్ల వారి ముందు లొంగిపోవాల్సిన గత్యంతరం వచ్చింది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్, అమిత్ షాల వద్ద సీబీఐ, ఈడీ ఉన్నాయి. వాటికి భయపడే వారి ముందు ముఖ్యమంత్రి మోకరిల్లారు’’ అని రాహుల్ విమర్శలు గుప్పించారు.


ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘స్టాలిన్ ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి. నేను దీనికి గ్యారెంటీ ఇస్తున్నాను. ఇది లాంఛనమే అయినప్పటికీ ఎన్నికల ప్రక్రియ ఉంది. అయితే దీన్ని అంత సులువుగా తీసుకోకూడదు. పోరాటం ఇంకా మిగిలే ఉంది. ఎందుకంటే, ఆర్ఎస్ఎస్, బీజేపీల వద్ద అపరిమితమైన డబ్బు ఉంది. ముందు వారిని తమిళనాడు నుంచి తరిమికొడదాం, ఆ తర్వాత ఢిల్లీ నుంచి పంపిచ్చేద్దాం’’ అని రాహుల్ గాంధీ అన్నారు.

Updated Date - 2021-03-29T00:07:23+05:30 IST