ఆత్మహత్యలు వద్దు... కొట్లాడి సాధించుకుందాం

ABN , First Publish Date - 2022-01-29T08:01:08+05:30 IST

పోరాడి సాధించుకున్న తెలంగాణలో యువత ఆత్మబలిదానాలకు పాల్పడవద్దని..

ఆత్మహత్యలు వద్దు... కొట్లాడి సాధించుకుందాం

  • సాగర్‌ కుటుంబాన్ని పరామర్శించిన ఈటల
  • ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్‌

బయ్యారం/మహబూబాబాద్‌ రూరల్‌, జనవరి 28 : పోరాడి సాధించుకున్న తెలంగాణలో యువత ఆత్మబలిదానాలకు పాల్పడవద్దని.. నీళ్లు, నిధులు, నియామకాలను కొట్లాడి సాధించుకుందామని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ యువతకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్‌ రావడం లేదని, దీనికి సీఎం కేసీఆరే బాధ్యత వహించాలంటూ ఇటీవల ఖమ్మంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి ముత్యాల సాగర్‌ కుటుంబాన్ని శుక్రవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మహబూబాబాద్‌ జిల్లా బయ్యారంలో, మహబూబాబాద్‌ బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ వెలువడక 11 ఏళ్లు అయిందన్నారు. పీఆర్సీ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం 1.90 లక్షల  ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని ప్రకటించిన సీఎం కేసీఆర్‌.. వెంటనే నోటిఫికేషన్‌ జారీ చేసి ఆత్మహత్యలను నివారించాలన్నారు. అనంతరం సాగర్‌ కుటుంబానికి రూ.50వేలు సాయం అందజేశారు. మరోపక్క బయ్యారంలో ఈటల పర్యటనను నిరసిస్తూ టీఆర్‌ఎస్‌ నేతలు ఇదే మండలం ఉప్పలపాడు పంచాయతీ లక్ష్మీనరసింహాపురం గ్రామంలో వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి నిరసన తెలిపారు. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం బయ్యారంలో ఉక్క పరిశ్రమను నెలకొల్పాలని బయ్యారం బస్టాండ్‌ సెంటర్‌లో టీఆర్‌ఎస్‌ నేతలు రాస్తారోకో చేశారు. 

Updated Date - 2022-01-29T08:01:08+05:30 IST