రైళ్లు ఆపాలని ఏ రాష్ట్రమూ కోరలేదు: భారతీయ రైల్వే
ABN , First Publish Date - 2021-04-17T00:01:41+05:30 IST
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మళ్లీ చెలరేగిపోతున్న నేపథ్యంలో రైళ్లను ఆపాలంటూ ఏ ఒక్క రాష్ట్రమూ తమను కోరలేదని
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మళ్లీ చెలరేగిపోతున్న నేపథ్యంలో రైళ్లను ఆపాలంటూ ఏ ఒక్క రాష్ట్రమూ తమను కోరలేదని రైల్వే బోర్డు చైర్మన్ సునీత్ శర్మ తెలిపారు. నేడు మీడియాతో మాట్లాడుతూ ఆయనీ విషయాన్ని వెల్లడించారు. ఐఆర్సీటీసీ వెబ్సైట్లో కరోనాకు సంబంధించి ఉన్న అన్ని ప్రొటోకాల్స్ను రాష్ట్రాలు పాటిస్తున్నట్టు చెప్పారు. కొన్ని ప్రాంతాలకు వెళ్లేటప్పుడు కొవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ అవసరం కాబట్టి తప్పకుండా ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకోవాలని ప్రయాణికులకు సూచించారు. రైళ్లను ఆపాలంటూ ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వమూ తమను సంప్రదించలేదని, ఒకవేళ అలాంటి సందర్భమేదైనా వస్తే రాష్ట్ర ప్రభుత్వాలు తమతో చర్చిస్తాయని అన్నారు.
కంటైన్మెంట్ జోన్లు ఉన్న ప్రాంతాల్లో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. రైలులో ప్రయాణించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నదానిపై వెబ్సైట్లో అవసరమైన సమాచారం మొత్తాన్ని ఉంచామన్నారు.
రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నామని, నిబంధనలు పాటించకుంటే జరిమానా తప్పదని హెచ్చరిస్తున్నామని శర్మ పేర్కొన్నారు. శ్రామిక్ రైళ్ల సేవలను తిరిగి అందుబాటులోకి తీసుకురావడంపై శర్మ మాట్లాడుతూ.. డిమాండ్ ఉంటే, అవసరం అనుకుంటే రైళ్లను నడుపుతామన్నారు. రద్దీని నివారించేందుకే రైల్వే ప్లాట్ఫాం టికెట్ ధరను పెంచినట్టు సునీత్ శర్మ తెలిపారు.