నో సిగ్నల్ .. నో పింఛన్
ABN , First Publish Date - 2022-01-21T06:01:05+05:30 IST
ఆసరా పింఛన్ల పంపిణీ సాంకేతిక కారణాలతో ఆలస్య మవుతోంది. హుజూర్నగర్ పట్టణంలో ఎనిమిది వేల మందికి పైగా పింఛన్దారులు ఉన్నారు.
రోజుల తరబడి తిరుగుతున్న వృద్ధులు
హుజూర్నగర్ , జనవరి 20 : ఆసరా పింఛన్ల పంపిణీ సాంకేతిక కారణాలతో ఆలస్య మవుతోంది. హుజూర్నగర్ పట్టణంలో ఎనిమిది వేల మందికి పైగా పింఛన్దారులు ఉన్నారు. వీరికి ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు, ఆపై సంక్రాంతి సెలవుల తర్వాత ఈ నెల 16వ తేదీ నుంచి తిరిగి పంపిణీని చేస్తున్నారు. ప్రతిరోజూ వేయిమందికి పైగానే ఆసరా పింఛన్ల కోసం వస్తున్నారు. అయితే బయోమెట్రిక్ యంత్రాలకు సిగ్నల్ అందకపోవడంతో పింఛన్దారులు సకాలంలో పింఛన్లు పొందలేకపోతున్నారు. దీంతో రోజుల తరబడి పోస్టాఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ పోస్టాఫీసు పరిధిలో 37 గ్రామాల్లోని 15,377 మంది లబ్ధిదారులకు రూ.3 కోట్ల 60 లక్షల పైచిలుకు డబ్బులు పింఛన్ల రూపంలో అందించాల్సి ఉంది. సిగ్నల్స్ అందకపోవడంతో ప్రతి రోజూ వచ్చిపోతున్నారు. ఇదిలా ఉండగా పెద్దసంఖ్యలో లబ్ధిదారులు తరలివస్తున్నా కొవిడ్ నిబంధనలు పాటించేలా పోస్టాఫీస్ అధికారులు చర్యలు తీసుకోలేదు. దీంతో ఆసరా లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.