జీతాలకు డబ్బుల్లేవ్‌!

ABN , First Publish Date - 2020-08-02T08:20:31+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల చెల్లింపుపై వరుసగా రెండోనెల కూడా ఆర్థిక శాఖ

జీతాలకు డబ్బుల్లేవ్‌!

  • 4న ఆర్‌బీఐలో బాండ్ల వేలం
  • 5న వేతనాలు అందే చాన్స్‌
  • అది కూడా ప్రాధాన్యతను బట్టే
  • వరుసగా రెండో నెలా అదే సీన్‌

అమరావతి, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల చెల్లింపుపై వరుసగా రెండోనెల కూడా ఆర్థిక శాఖ ఆపసోపాలు పడుతోంది. ఖజానాలో నిధులు లేకపోవడంతో ఉద్యోగులకు సకాలంలో వేతనాలు ఇవ్వలేకపోతోంది. గత నెల 1న ఇవ్వాల్సిన వేతనాలను ఆనెల 8వ తేదీన గానీ ఇవ్వలేకపోయారు. ఇప్పుడు ఆగస్టు 1న చెల్లించాల్సిన వేతనాలు, పెన్షన్లు కూడా ఈనెల 5 వరకు వేతన జీవులకు, పింఛను లబ్ధిదారులకు అందే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వ ఖజానాలో ఉన్న కొద్దిపాటి నిధులతో వేతనాలు చెల్లించడం కుదరదు కాబట్టి అప్పుకోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే, దీనికి కూడా 4వ తేదీ వరకు నిరీక్షించాల్సి ఉంది. ఆర్‌బీఐ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ బాండ్లు, సెక్యూరిటీలు వేలం వేసి అప్పు తెచ్చుకోవచ్చు. దీనికిగాను మంగళవారం మాత్రమే అవకాశం ఉంటుంది. 4వ తేదీ మంగళవారం నాడు ఆర్‌బీఐలో బాండ్ల వేలం ద్వారా రూ.2,000 కోట్లు అప్పు తెచ్చేందుకు ఆర్థిక శాఖ సిద్ధమవుతోంది. 


వాస్తవానికి ఈ నిధులు కూడా వేతనాలు, పెన్షన్లకు ఏ మాత్రమూ సరిపోవు. ఉద్యోగులందరికీ వేతనాలు, లబ్ధిదారులందరికీ పెన్షన్లు ఇవ్వాలంటే ప్రతి నెలా దాదాపు రూ.5,500 కోట్లు అవసరం. ఇదిలావుంటే, వేజ్‌ అండ్‌ మీన్స్‌ సౌకర్యం ద్వారా ఆర్‌బీఐ నుంచి రూ.2,000 కోట్లు తెచ్చి వేతనాలకు చెల్లించే అవకాశం ఉంది. కానీ, ఇప్పటికే వేజ్‌ అండ్‌ మీన్స్‌ సౌకర్యాన్ని ఆర్థిక శాఖ వినియోగించుకున్నట్టు తెలుస్తోంది. పోనీ, ఓవర్‌ డ్రాఫ్ట్‌కి వెళ్లి మరో రూ.2,000 కోట్లు తెచ్చుకుని అవసరాలకు వాడుకునే వెసులుబాటు ఉన్నా.. సీఎం జగన్‌ దీనికి ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 4 లేదా 5వ తేదీ నుంచి ప్రాధాన్యత క్రమంలో ఉద్యోగులకు నిధుల లభ్యతను బట్టి ఆర్థిక శాఖ వేతనాలు చెల్లించే అవకాశముంది. ముందుగా కొవిడ్‌-19 విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి, ఆ తర్వాత సచివాలయ ఉద్యోగులకు వేతనాలు అందే అవకాశం ఉంది. అయితే, ఈ నెల 1వ తేదీ శనివారం సెలవు కాబట్టి, 2, 3 తేదీలు కూడా సెలవులే కనుక ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేక పోతున్నామని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు.


సీఎఫ్ఎంఎస్‌లో ప్రత్యేక మాడ్యుల్‌

ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌ రికార్డులకు సంబంధించి పూర్తివివరాలతో కూడిన మాస్టర్‌ డేటాను ఒకేచోట చేర్చేందుకు సీఎ్‌ఫఎంఎ్‌సలో హ్యూమన్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీ్‌స(హెచ్‌సీఎం) అనే ఒక ప్రత్యేక మాడ్యూల్‌ను సిద్ధం చేశారు. అన్ని శాఖాధిపతుల కార్యాలయాల్లోను ఈ మాడ్యూల్‌ ప్రవేశ పెట్టేందుకు ఆర్థికశాఖ కసరత్తు ప్రారంభించింది. దీని ద్వారా ఉద్యోగులకు ఎలకా్ట్రనిక్‌ సర్వీస్‌ రిజిస్టర్‌ నిర్వహించనున్నారు. ఫలితంగా ఉద్యోగులు రిటైర్‌ అయిన సందర్భాల్లో స్వల్ప వ్యవధిలోనే పెన్షన్‌, ఇతర ప్రయోజనాలు ఖరారు చేసే అవకాశం ఉంటుంది. ఈ మాడ్యూల్‌ నిర్వహణపై అన్ని శాఖలకు అవగాహన కల్పించేందుకు ఆగస్టు 5న సమావేశాలు నిర్వహించనున్నారు.  

Updated Date - 2020-08-02T08:20:31+05:30 IST