ప్రాజెక్టులున్నా.. ప్రయోజనం సున్నా

ABN , First Publish Date - 2022-05-20T04:47:32+05:30 IST

అనాధిగా జిల్లా రైతాంగానికి వర్షమే సాగుకు దిక్కవుతోంది. ఏళ్లుగా ప్రధాన ప్రాజెక్టులన్నీ పెండింగ్‌లో ఉండడంతో సాగులో పెద్దగా మార్పు ఉండడం లేదు. సరైన సాగునీటి వసతి లేక వేలాది ఎకరాల భూమి నిరుపయోగంగా మారుతోంది. గత్యంతరం లేక ఆరుతడి పంటలతో సరిపెట్టాల్సి వస్తోంది. వానస్తే పంట లేకుంటే లేదు అన్న చందంగా మారుతోంది. అన్నదాతలు పూర్తిగా వర్షాదార పంటలపై ఆధార పడుతూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రాజెక్టు పూర్తై సక్రమంగా నీరందిస్తే తప్ప సాగు పండు గలా మారే పరిస్థితి కనిపించడం లేదు.

ప్రాజెక్టులున్నా.. ప్రయోజనం సున్నా
కుమరం భీం ప్రాజెక్టు

నిండా నీరు..పారని తీరు

పెండింగ్‌లోనే ప్రాజెక్టులు

ముందుకు కదలని పనులు

జిల్లాలో ఏళ్లుగా సాగునీటి అవస్థలు

నీటి వనరులున్నా ఉపయోగం పడని వైనం

ఆసిఫాబాద్‌, మే 19: అనాధిగా జిల్లా రైతాంగానికి వర్షమే సాగుకు దిక్కవుతోంది. ఏళ్లుగా ప్రధాన ప్రాజెక్టులన్నీ పెండింగ్‌లో ఉండడంతో సాగులో పెద్దగా మార్పు ఉండడం లేదు. సరైన సాగునీటి వసతి లేక వేలాది ఎకరాల భూమి నిరుపయోగంగా మారుతోంది. గత్యంతరం లేక ఆరుతడి పంటలతో సరిపెట్టాల్సి వస్తోంది. వానస్తే పంట లేకుంటే లేదు అన్న చందంగా మారుతోంది. అన్నదాతలు పూర్తిగా వర్షాదార పంటలపై ఆధార పడుతూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రాజెక్టు పూర్తై సక్రమంగా నీరందిస్తే తప్ప సాగు పండు గలా మారే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు ఉన్నప్పటికీ అవి పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రధా నంగా కుమరం భీం ప్రాజెక్టు, జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తిస్థాయిలో కాలేదు. అదే విధంగా వట్టి వాగు, చెలిమెల వాగు ప్రాజెక్టు కాలువలు మరమ్మతులకు నోచుకోవడం లేదు. 

పూర్తి కాని కుమరం భీం

జిల్లాలో సాగునీటికి గుండెకాయ వంటి కుమరం భీం ప్రాజెక్టు ఏళ్లుగా రైతులకు పూర్తి స్థాయిలో సాగునీరందిం చడం లేదు. పది టీఎంసీల సామర్థ్యంతో సుమారు రూ.600 కోట్లకు పైగా అంచనాలతో నిర్మితమైన ఈ ప్రాజెక్టు లక్ష్యంలో సగం కూడా నీరందించడం లేదు. కుడి ప్రధాన కాలువ ద్వారా ఆసిఫాబాద్‌ మండల పరిధిలో ఆరు వేల ఎకరాలు, ప్రధాన ఎడమ కాలువ ద్వారా ఆసిఫాబాద్‌తో పాటు కాగజ్‌ నగర్‌, సిర్పూర్‌(టి) మండలాల్లోని 45,500 ఎకరాలకు సాగు నీటిని అందించాలని ప్రాజెక్టును రూపొందించారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తై ఏళ్లు గడుస్తున్నా కాలువల పనులు పూర్తి కాలేదు. 

దయనీయ స్థితిలో వట్టివాగు

ఆసిఫాబాద్‌ మండలం వట్టివాగు నీటిని స్థానిక పొలా లకు అందించాలనే ఉద్దేశ్యంతో 1998లో 24,500 ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. కుడి కాలువ ద్వారా 21,800 ఎకరాలు, ఎడమ కాలువ ద్వారా 2700 ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా నిర్దేశించారు. కాలువలు ప్రాజెక్టు నిర్మాణం నుంచి ఆధునీకరణకు నోచుకోవడం లేదు. దీనికి తోడు ఇప్పటికే కాలువలు మొత్తం దెబ్బతిన్నాయి. లైనింగ్‌ కోల్పోయి చెట్లు ఏపుగా పెరిగి అధ్వాన్నంగా మారాయి. చాలా చోట్ల కాలువలు నామరూపాలు లేకుండా పోయాయి. దీంతో ఆసిఫాబాద్‌, రెబ్బెన మండలాల పరిధి లోని ఆయకట్టు రైతులకు సాగునీరు అందించే స్థితిలో లేదు. అధికారులు ఆధునీకరణ పనుల కోసం ప్రతిపాదనలను పంపినప్పటికీ వాటికి నిధులు విడుదల కాలేదు. 

జగన్నాథ్‌‘పూర్‌’

కాగజ్‌నగర్‌ మండలంలోని పెద్దవాగుపై నిర్మించిన జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టు పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాగజ్‌నగర్‌, దహెగాం మండలాల పరిధి 15000 ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో ప్రాజెక్టు నిర్మాణ పనులను చేపట్టినప్పటికీ నత్తనడకన కొనసాగుతున్నాయి. భూ సేకరణ, తదితర సమస్యలతో పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో ప్రాజెక్టు నిర్మాణం పనుల్లో జాప్యంతో ఆయకట్టు దారులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం చేపడితే తమ భూములు పంట పొలాలుగా మారుతాయని ఆశించిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. 

పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయాలి

బోగే ఉపేందర్‌, సీపీఐ జిల్లా నాయకులు 

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలి. జిల్లాలో పంటల సాగు కోసం సరిపడ నీరు ఉన్న ప్పటికీ వాటిని వినియోగించుకోలేని దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి. కుమరం భీం ప్రాజెక్టు నిర్మించినప్పటికీ ప్రధానకాలువలు ఇంకా నిర్మాణానికి నోచుకోలేదు. వట్టివాగు ప్రాజెక్టు కాలువలు పూర్తిగా ధ్వంసం అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వెంటనే కాలువల మరమ్మతుల కోసం నిధులు కేటాయించాలి.

Updated Date - 2022-05-20T04:47:32+05:30 IST