ఎవరికీ పట్టని ధరల పెరుగుదల!

ABN , First Publish Date - 2021-07-10T06:52:04+05:30 IST

తరతరాల వారి ఉమ్మడి అనుభవం ధరల పెరుగుదల. 1970, 1980 దశకాలలో వివిధ కారణాల వల్ల ఎప్పుడైనా ఏదైనా ఒక నిత్యావసర వస్తువు ధర పెరిగితే ప్రజలు ఎలా నిరసన తెలిపేవారో నాకు ఇప్పటికీ....

ఎవరికీ పట్టని ధరల పెరుగుదల!

తరతరాల వారి ఉమ్మడి అనుభవం ధరల పెరుగుదల. 1970, 1980 దశకాలలో వివిధ కారణాల వల్ల ఎప్పుడైనా ఏదైనా ఒక నిత్యావసర వస్తువు ధర పెరిగితే ప్రజలు ఎలా నిరసన తెలిపేవారో నాకు ఇప్పటికీ బాగా గుర్తు ఉంది. పెట్రోల్ ధర అతి స్వల్పంగా పెరిగినా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యేవి. కొన్ని సందర్భాలలో వినియోగదారులు ఆగ్రహోదగ్రులయ్యేవారు. దరిమిలా మరోసారి పెట్రోల్ ధర పెంచే ముందు ప్రభుత్వం ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించుకునేది. ప్రజలు తీవ్రంగా ప్రతిస్పందిస్తారేమోనన్న భయం నాటి అధికార వర్గాలలో ఉండేది. ఇప్పుడూ పెట్రోల్‌తో పాటు ఇతర నిత్యావసర సరుకుల ధరలూ పెరుగుతూనే ఉన్నాయి.


గతంలో కంటే మరింత వేగవంతంగా పెరుగుతున్నాయి. అయితే ఎందుకో గానీ ప్రజల ప్రతి స్పందన గతంలో వలే తీక్షణంగా ఉండడం లేదు! ప్రింట్ మీడియా, టీవీలో కొంతమంది గొణుగుళ్లు, సణుగుళ్లు చేస్తున్నారు. అయితే అవి విన్పించేది ఎవరికి? అనవసర విషయాలకు కూడా అగ్గిమీద గుగ్గిలం అయిపోయే సామాజిక మాధ్యమాల యోధులు మౌనంగా ఉండిపోవడం వింతగా ఉంది. ధరలు నిత్యం పెరిగిపోతూనే ఉన్నా ప్రజలకు ఏమీ పట్టనట్టుగా ఉంది. ప్రతిపక్షాలు యథాప్రకారం నిరసనలు తెలుపుతున్నాయి. అయితే అవి ప్రజలను కదిలించడం లేదు. పెట్రోల్ ధర లీటర్ వంద రూపాయలు దాటిపోయినా ఎక్కడా ఎలాంటి ఆగ్రహావేశాలు వ్యక్తం కావడం లేదు.


నిరసనలతో కాలం వ్యర్థం చేసుకోవడం కంటే పెరిగిన ఖర్చులను భరించేందుకు మరింత ఆదాయ సముపార్జనకు కొత్త మార్గాల అన్వేషణలో ప్రజలు తల మునకలు అయిపోయారా అన్న భావన కలుగుతోంది. అంతర్జాతీయ విపణిలో క్రూడాయిల్ ధర తరచు పెరగనప్పటికీ మన దేశంలో పెట్రోల్ ధర దాదాపుగా ప్రతి రోజూ పెరుగుతోంది. లీటర్ పెట్రోల్ ధర మూడంకెల్లో ఉంటున్నా భరిస్తున్నామంటే మనం సంపన్నులమయిపోయామా ఏమిటి? సుశాంత్ సింగ్ రాజ్‌పుట్ ఆత్మహత్యపై మీడియా ఒక సంవత్సరం పాటు తన దృష్టిని కేంద్రీకరించింది. మరి ధరల పెరుగుదల సమస్యపై మీడియా అటువంటి శ్రద్ధను ఎందుకు చూపడం లేదు?


-డి. నాగార్జున, హైదరాబాద్

Updated Date - 2021-07-10T06:52:04+05:30 IST