లోన్ మారటోరియం పొడిగింపు అవసరం లేదు: ఎస్బీఐ చైర్మన్
ABN , First Publish Date - 2020-07-11T22:15:09+05:30 IST
అన్ని రంగాలకూ వర్తించే లోన్ మారటోరియంను డిసెంబర్ వరకూ పొడిగించాల్సిన అవసరం లేదని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
న్యూఢిల్లీ: అన్ని రంగాలకూ వర్తించే లోన్ మారటోరియంను డిసెంబర్ వరకూ పొడిగించాల్సిన అవసరం లేదని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ అభిప్రాయపడ్డారు. అవసరాన్ని బట్టి కొన్ని రంగాలకు మాత్రమే దీన్ని పరిమితం చేసే అవకాశాన్ని పరిశీలించొచ్చని వ్యాఖ్యానించారు. ఇక కరోనా సంక్షోభం కారణంగా పేరుకుపోతున్న మొండి బకాయిల పట్ల ఎస్బీఐ అనవసర ఆందోళన చెందటం లేదని కూడా ఆయన తెలిపారు. జూన్ నెల నుంచే ఆర్థికవ్యవస్థ కొత్త చిగుళ్లు వేస్తోందని, కేవలం కొన్ని రంగాలే ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక ఆర్బీఐ తొలిసారి ప్రకటించిన మూడునెలల లోన్ మారటోరియం మే 31న ముగిసిన విషయం తెలిసిందే. అయితే అనుకున్న దానికంటే ఎక్కువకాలం లాక్ డౌన్ కొనసాగడంతో కేంద్ర బ్యాంకు ఈ మారటోరియంను ఆగస్టు 31 వరకూ పొడిగించింది. ఆ తరువాత మారటోరియం భవిష్యత్తు ఎలా ఉంటుందనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎస్బీఐ చైర్మన్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.