విగ్రహాల ఏర్పాటుపై సంచలన తీర్పు..

ABN , First Publish Date - 2021-10-08T18:15:37+05:30 IST

తమిళనాడులో విగ్రహాల ఏర్పాటుపై మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన

విగ్రహాల ఏర్పాటుపై సంచలన తీర్పు..

చెన్నై: తమిళనాడులో విగ్రహాల ఏర్పాటుపై మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన నాయకుల విగ్రహాలన్నింటినీ 6 నెలల్లోపు తొలగించాలని, లీడర్స్ పార్క్‌లు ఏర్పాటు చేసి అక్కడకు వాటిని తరలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక నుంచి విగ్రహాలను హైవేలు, బహిరంగ ప్రదేశాలు, పోరంబోకు భూముల్లో ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇవ్వవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని జస్టిస్ ఎస్.ఎం.సుబ్రమణియం ఆదేశించారు. విగ్రహాల ఏర్పాటుకు మార్గదర్శకాలు రూపొందించాలని కూడా ఆయన పేర్కొన్నారు.


రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో లీడర్స్ పార్క్‌లు ఏర్పాటు చేయాలని, అనుమతి తీసుకుని ఏర్పాటు చేసిన విగ్రహాలను మాత్రమే పార్క్‌లలో ఉంచి, వాటిని అక్కడ ఏర్పాటు చేసిన వారి నుంచి మెయింటనెన్స్ ఖర్చులు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. పోరంబోకు ప్రాంతంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించాలని అరక్కోణం తాలూకా తహసిల్దారు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఎం.వీరరాఘవన్ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి ఈ ఆదేశాలు ఇచ్చారు. పిటిషన్ విచారణకు ఆయన నిరాకరిస్తూ, రాజకీయ పార్టీలు, ఆయా మత, కుల, భాష, ప్రాంత, వర్గాలకు చెందిన వారు తమ ఇష్టాఇష్టాలకు అనుగుణంగా ఇలాంటి విగ్రహాలను ఏర్పాటు చేస్తూ ఉంటారని అన్నారు. ప్రముఖ నేతలను గుర్తుపెట్టుకునేందుకు వీలుగా వారి విగ్రహాలను ఏర్పాటు చేయాలనుకోవడాన్ని తప్పుపట్టలేమని, అయితే ఒక గ్రూపు ఐడియాలజీకి మరో గ్రూపు ఐడియాలజీకి తేడాలుంటాయని, ఆ దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో వాటిని ఏర్పాటు చేయాలనుకుంటే తప్పనిసరిగా రూల్స్ ఉండాలని అన్నారు.

Updated Date - 2021-10-08T18:15:37+05:30 IST