ఒమైక్రాన్ నివారణకు graded response action plan
ABN , First Publish Date - 2021-12-07T13:12:22+05:30 IST
ఒమైక్రాన్ వేరియంట్ వల్ల ఉత్పన్నమయ్యే కొవిడ్-19 పరిస్థితిని ఢిల్లీ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ చెప్పారు...
న్యూఢిల్లీ: ఒమైక్రాన్ వేరియంట్ వల్ల ఉత్పన్నమయ్యే కొవిడ్-19 పరిస్థితిని ఢిల్లీ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ చెప్పారు. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో లాక్డౌన్ చేసే అవకాశాన్ని కూడా జైన్ తోసిపుచ్చారు.ఢిల్లీ ఆప్ ప్రభుత్వం ఒమైక్రాన్ నివారణకు ఇప్పటికే ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్’ని రూపొందించిందని, కేసులు పెరిగినప్పుడు తదనుగుణంగా ఈ వేరియెంట్ కట్టడికి చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. ముఖ్యంగా కొత్త వేరియంట్ ద్వారా ప్రభావితమైన విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల పరీక్ష, ట్రేసింగ్, ఐసోలేషన్లపై దృష్టి పెడుతున్నామని జైన్ పేర్కొన్నారు.ఢిల్లీ ప్రభుత్వ అధికారులు ఒమైక్రాన్ వేరియంట్ ద్వారా ప్రభావితమైన దేశాల నుంచి వచ్చే ప్రజలందరినీ పరీక్షిస్తున్నారని తెలిపారు.
ఇప్పటివరకు, మొత్తం 27 మందిని ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి పంపించామని, వారిలో 17 మందికి కొవిడ్-పాజిటివ్ తేలిందని మంత్రి వివరించారు. ఢిల్లీలో ఒమైక్రాన్ వేరియంట్ ఒక వ్యక్తికి మాత్రమే సోకినట్లు నిర్ధారించారు.ప్రస్తుతం ఢిల్లీలో లాక్డౌన్కు అవకాశం లేదని ఢిల్లీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.ఒమైక్రాన్ వేరియంట్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే విమానాలను కొంతకాలం నిలిపివేయాలని విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గతంలో కేంద్రానికి లేఖ రాసినా కేంద్ర ప్రభుత్వం అలా చేయలేదని మంత్రి జైన్ వివరించారు.