‘జగన్‌’ వద్దు.. అంబేడ్కర్‌ పేరే ముద్దు

ABN , First Publish Date - 2022-08-17T07:56:19+05:30 IST

‘జగన్‌’ వద్దు.. అంబేడ్కర్‌ పేరే ముద్దు

‘జగన్‌’ వద్దు.. అంబేడ్కర్‌ పేరే ముద్దు

విదేశీ విద్యకు జగన్‌ పేరుపై దళిత నేతల అభ్యంతరం

మంగళగిరిలో టీడీపీ ఎస్సీ సెల్‌ నేతల నిరవధిక దీక్ష


మంగళగిరి సిటీ, ఆగస్టు 16: పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఉద్దేశించిన విదేశీ విద్య పథకానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరును తొలగించి.. సీఎం వైఎస్‌ జగన్‌ తన పేరును పెట్టుకోవడంపై దళిత నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. విదేశీ విద్య పథకానికి అంబేడ్కర్‌ పేరును కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ ఎస్సీ సెల్‌ నేతలు మంగళవారం నిరవధిక దీక్షకు దిగారు. మంగళగిరి టీడీపీ కార్యాలయం నుంచి ప్రదర్శనగా వెళ్లి తాలూకా సెంటరులోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద దీక్షకు కూర్చొన్నారు. టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెస్‌ రాజు దీక్షలను ప్రారంభించి ప్రసంగించారు. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక దళితుల సంక్షేమం కోసం ఉద్దేశించిన 29 పథకాలను రద్దు చేశారన్నారు. దళితులను ఉన్నత విద్యకు దూరం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. విదేశీ విద్య పథకానికి ప్రపంచ మేధావి అయిన అంబేడ్కర్‌ పేరును తొలగించి ఆర్థిక ఉగ్రవాది జగన్‌రెడ్డి తన పేరు పెట్టుకోవడానికి ఏం అర్హత ఉందని నిలదీశారు. విదేశీ విద్యకు తిరిగి అంబేద్కర్‌ పేరును కొనసాగించే వరకు దీక్షకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. టీడీపీ ఎస్సీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కనికళ్ల చిరంజీవి, క్రిస్టియన్‌ సెల్‌ అధ్యక్షుడు యర్రగుంట్ల భాగ్యారావు, గుంటూరు పార్లమెంట్‌ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మైనర్‌బాబు ఆధ్వర్యంలో పలువురు నేతలు దీక్ష చేపట్టారు.


Updated Date - 2022-08-17T07:56:19+05:30 IST