Governer Koshyari: మరాఠా ప్రజలను అవమానించ లేదు
ABN , First Publish Date - 2022-07-30T20:44:11+05:30 IST
గుజరాతీలు, రాజస్థానీలు మహారాష్ట్రను విడిచిపోతే ముంబైలో డబ్బేం మిగలదంటూ తాను చేసిన వ్యాఖ్యలపై అన్ని వర్గాల నుంచి..
ముంబై: గుజరాతీలు, రాజస్థానీలు మహారాష్ట్రను విడిచిపోతే ముంబైలో డబ్బేం మిగలదంటూ తాను చేసిన వ్యాఖ్యలపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి శనివారంనాడు వివరణ ఇచ్చారు. ముంబై దేశ ఆర్థిక రాజధానిగానే ఉంటుందని, కష్టపడి పనిచేసే మహారాష్ట్ర ప్రజలను చిన్నబుచ్చే ఉద్దేశం తనకు లేదని అన్నారు. ఛత్రపతి శివాజీ, మరాఠా ప్రజల గడ్డపై పని చేసే అదృష్టం తనకు దక్కినందుకు గర్విస్తున్నానని, ఆ కారణంగానే తాను అతి తక్కువ కాలంలో మరాఠా నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నానని వరుస ట్వీట్లలో కోష్యారి అన్నారు.
''ముంబై నగరంలో వాణిజ్యం, పరిశ్రమల రంగంలో గుజరాతీలు, రాజస్థానీల సేవల గురించి ఒక కార్యక్రమంలో నేను ప్రసంగించాను. దాని అర్థం మరాఠా ప్రజలను చిన్నబుచ్చడం కాదు. నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు'' అని 80 ఏళ్ల కోష్యారి ఓ ట్వీట్లో తెలిపారు. మహారాష్ట్రకు ముంబై గర్వకారణమని, దేశ ఆర్థిక రాజధాని కూడా అని ఆయన అన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూసేవారు తన వ్యాఖ్యలకు తప్పుగా అర్థం తీసుకుంటున్నారని, ఈ వైఖరి మంచిది కాదని అన్నారు. ఒక వర్గాన్ని ప్రశంసించడం అంటే తక్కిన వాళ్లను అవమానించడం కాదని, రాజకీయ పార్టీలు అనవసరమైన వివాదాలు లేవనెత్తవద్దని అన్నారు. "మహారాష్ట్రను కానీ మరాఠా ప్రజలను కానీ ఎన్నడూ అవమానించేది లేదు'' అని ఆయన స్పష్టం చేశారు.
దీనికి ముందు, ఓ కార్యక్రమంలో కోష్యారి మాట్లాడుతూ, గుజరాతీలు, రాజస్థానీలు ముఖ్యంగా ముంబై, థానేను విడిచి వెళితే ముంబైలో డబ్బు మిగలదని, దేశ వాణిజ్య రాజధానిగా ఉండే అర్హతను ముంబై కోల్పోతుందని వ్యాఖ్యానించారు. దీనిపై శివసేన సహా పలు పార్టీల నేతలు విరుచుకుపడ్డారు. కష్టపడి మనిచేసే మరాఠా ప్రజలను అవమానించేలా మాట్లాడిన కోష్యారిని తక్షణం గవర్నర్ పదవి నుంచి తొలగించాలని, మరాఠా వ్యక్తిగా ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వెంటనే గవర్నర్ వ్యాఖ్యలను ఖండించాలని వారు డిమాండ్ చేశారు.