సూపర్ ఫాస్ట్గా.. వెళ్లిపోతున్నాయ్!
ABN , First Publish Date - 2022-05-28T06:34:52+05:30 IST
ఏ రైలు అయినా ఆ జంక్షన్ టచ్ చేసి వెళ్లాల్సిందే. ప్రతి నిత్యం వందల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుం టారు.
పేరుకే జంక్షన్.. అయినా నో హాల్ట్
నిడదవోలు మీదుగా 80 రైళ్లు
ఆగేది సుమారుగా 18 మాత్రమే
ఆదాయం బాగున్నా ఇంతే
పట్టించుకోని పాలకులు
నిడదవోలు, మే 27 : ఏ రైలు అయినా ఆ జంక్షన్ టచ్ చేసి వెళ్లాల్సిందే. ప్రతి నిత్యం వందల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుం టారు. అటువంటి జంక్షన్లో ముఖ్య మైన ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్ రైళ్ళకు హాల్ట్ లేక పోవడంతో ప్రయా ణికుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అయినా పాలకుల్లో కదలిక లేదు. దీంతో సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే అటు తాడేపల్లిగూడెం కానీ.. లేదంటే ఇటు రాజమండ్రి కానీ వెళ్లాల్సిందే. ఇదీ నిడదవోలు జంక్షన్ దుస్థితి. పేరుకు జంక్షన్ అయినా ప్రయాణికులకు మాత్రం ఉప యోగంలేదు.విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో నిడదవోలు జంక్షన్ బి.క్లాస్ స్టేషన్ జాబితాలో ఉన్నప్పటికి పాల కుల, అధికారుల నిర్లక్ష్యం కారణంగా సాధారణ రైల్వే స్టేషన్గానే మిగిలి పోయింది. చైన్నయ్ హౌరా మెయిన్ లైనులో ఉన్నా చాలా ఏళ్లగా కనీస అభివృద్ధికి నోచుకోవడంలేదు. ఈ జంక్షన్ నుంచిప్రయాణికుల రాకపోకల ద్వారా గూడ్స్ ద్వారా వస్తు రవాణా ద్వారా రైల్వే శాఖకు ఆదాయం బాగానే ఉన్నా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్ళకు హాల్టు కల్పించడంలో అధికారులు విఫల మవుతున్నారనే విమర్శలు ఉన్నాయి.
ఆదాయం ఉన్నా.. ఆగని రైళ్లు
నిడదవోలు జంక్షన్ నుంచి సుమారు నెల రోజులకు 80 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండగా టిక్కెట్ల రూపేణా వీరిద్వారా నెలకు రూ. 46.50 లక్షల ఆదాయం వస్తుండగా మరో పక్క నిడదవోలు జంక్షన్ నుంచి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బియ్యం వ్యాగన్స్ ద్వారా నెలకు రూ.కోటిపైగానే ఆదాయం వస్తున్నట్టు అంచనా. ఇంత ఆదాయం ఉన్నా రైళ్ళకు హాల్ట్ లేదు. పగటి పూట విశాఖపట్టణం నుంచి సికింద్రాబాద్ వెళ్ళే జన్మభూమి ఎక్స్ప్రెస్ రాత్రి వేళ కాకినాడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళే కోకనాడ ఎక్స్ప్రెస్, ముంబాయి వేళ్ళే లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ తదితర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లకు హాల్టు లేదు. దీంతో ప్రయాణికులు అటు పశ్చిమగో దావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం, తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన రాజ మహేంద్రవరం రైల్వే స్టేషన్లపైనే ఆధారపడుతున్నారు. నిడద వోలు నుంచి పగటిపూట సికింద్రాబాద్ వెళ్ళేందుకు జన్మభూమి ఎక్స్ప్రెస్, ఢిల్లీ వెళ్లేందుకు స్వర్ణజయంతి ఎక్స్ప్రెస్ లాంటి వాటికి హాల్ట్ కల్పిస్తే ప్రయాణికులకు ఎంతో మేలు చేకూరనుంది.
సూపర్ఫాస్ట్లకు నో హాల్ట్
12805 విశాఖపట్టణం - లింగంపల్లి
12806 లింగంపల్లి - విశాఖపట్టణం(జన్మభూమి)
12775 కోకనాడ - లింగంపల్లి
12776 లింగంపల్లి - కోకనాడ (కోకనాడ)
18519 విశాఖపట్టణం - ముంబాయి
18520 ముంబాయి - విశాఖపట్టణం (ఎల్టీటీ)
12841 షాలిమార్ - చెన్నయ్
12842 చెన్నయ్ - షాలిమార్ (కోరమండల్)
20805 విశాఖపట్టణం - న్యూఢిల్లీ
20806 న్యూఢిల్లీ - విశాఖపట్టణం (రాజధాని)
నిడదవోలు జంక్షన్ మీదుగా 80 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇందులో సుమారుగా 18 ఎక్స్ప్రెస్, పాసింజర్ రైళ్లు ఆగుతాయి. జంక్షన్ మీదుగా వెళుతున్నా రైళ్లకు హాల్ట్ లేకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు.