భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు పెరిగితే.. ట్రంప్ ఎవరి పక్షం?

ABN , First Publish Date - 2020-07-11T23:12:52+05:30 IST

భారత్, చైనా దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ట్రంప్ సర్కార్ భారత్‌కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. చైనాకు సంబంధించిన యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధిస్తే.. దాన్ని కూడా అమెరికా సమర్దించింది.

భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు పెరిగితే.. ట్రంప్ ఎవరి పక్షం?

వాషింగ్టన్: భారత్, చైనా దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ట్రంప్ సర్కార్ భారత్‌కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. చైనాకు సంబంధించిన యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధిస్తే.. దాన్ని కూడా అమెరికా సమర్దించింది. కరోనా నేపథ్యంలో చైనాపై ప్రతీకారం తీర్చుకోవడానికి టిక్‌టాక్‌ను బ్యాన్ చేసే అంశాన్ని తాము పరిశీలిస్తున్నట్లు ప్రకటించింది. అయితే.. ఇప్పుడు ఇదంతా ఎందుకు గుర్తు చేస్తున్నట్టు అనుకుంటున్నారా? వీటిని గుర్తు చేయడానికి ఓ ముఖ్య కారణం ఉంది.  భవిష్యత్తులో భారత్-చైనాల మధ్య సరిహద్దు అంశంలో ఘర్షణ వాతావరణం ఏర్పడితే.. అమెరికా ఎవరికి మద్దతు ఇస్తుందనేది ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. ఇప్పటిలాగే.. భవిష్యత్తులోనూ ట్రంప్ తన మద్దతు భారత్‌కే ఇస్తాడా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశం అవ్వడానికి.. అమెరికా మాజీ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ చేసిన వ్యాఖ్యలే కారణం. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడిన జాన్ బోల్ట్.. సరిహద్దు విషయంలో భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు పెరిగితే, డొనాల్డ్ ట్రంప్ చైనాకు వ్యతిరేకంగా భారతదేశానికి మద్దతు ఇస్తారనే గ్యారెంటీ లేదంటూ వ్యాఖ్యానించారు. ఇరుదేశాల మధ్య దశాబ్దాల నుంచి కొనసాగుతున్న ఈ సమస్య గురించి ట్రంప్‌కు పూర్తి స్థాయి అవగాహన లేదని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలోనే ట్రంప్.. భారత్‌కు మద్దతిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే.. నవంబర్‌లో అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ట్రంప్.. చైనా సాయం కోరినట్లు జాన్ బోల్టన్ గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే.


Updated Date - 2020-07-11T23:12:52+05:30 IST