యాక్టివ్ కేసుల తగ్గుముఖం
ABN , First Publish Date - 2021-10-18T06:11:27+05:30 IST
యాక్టివ్ కేసుల తగ్గుముఖం
జిల్లాలో వరుసగా 11వ రోజూ నో కరోనా
ములుగు, అక్టోబరు 17: జిల్లాలో కరోనా యాక్టివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. వరుసగా 11వ రోజూ జీరో పాజిటివ్ నమోదైంది. అంతకు ముందు నెలరోజుల నుంచి ప్రతిరోజూ ఐదులోపే కేసులు నమోదు కాగా వైరస్ బారినపడ్డ వారు త్వరగా కోలుకోవడంతో ప్రస్తుతం జిల్లాలో యాక్టివ్ కేసులు పడిపోయాయి. వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రస్తుతం ఒకే ఒక్క యాక్టివ్ కేసు ఉంది. ఆదివారం 109 మందికి రాపిడ్ టెస్టులు చేయగా అందరికీ నెగెటివ్ వచ్చింది. ఇప్పటి వరకు జిల్లాలో 3,31,291 మందికి రాపిడ్, 2,700 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. మొత్తంగా 15,289 మంది వైరస్ బారినపడగా 66 మరణాలు సంభవించాయి. 15,222 మంది వైర్సను జయించారు. ములుగు మండలం జాకారం, ఏటూరునాగారంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లు ఖాళీ అయ్యాయి. ములుగు, ఏటూరునాగారం ఆస్పత్రులకు కూడా వైరస్ కేసులేవీ రాలేదు. ఏడాదిన్నర తర్వాత జిల్లాలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే బతుకమ్మ, దసరా వేడుకల్లో చాలా మంది కొవిడ్ నిబంధనలు పాటించలేదు. దీంతో మళ్లీ వైరస్ వ్యాపిస్తుందనే ఆందోళన వ్యక్తమవుతుండగా పెద్దఎత్తున సాగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్తో వైర్సకు చెక్పడిందని, టీకా తీసుకున్న వారిలో రోగనిరోధక శక్తి పెరిగిందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ కేసులు వచ్చినా సాధారణ లక్షణాలతో రోజుకు పదికిమించక పోవచ్చని అభిప్రాయపడుతున్నారు.