పరిహారం అందక.. ఉపాధి లేక..!

ABN , First Publish Date - 2022-07-06T05:00:20+05:30 IST

ఆ ప్రాంతం పచ్చటి పొలాలతో కళకళలాడుతూ ఎప్పుడు కనిపించేది. నేడు ఆ పొలాలన్నీ నీట మునిగాయి. వ్యవసాయమే జీవనాధారంగా చేసుకుని జీవించే రైతన్నలు రోడ్డున పడ్డారు.

పరిహారం అందక.. ఉపాధి లేక..!
నీట మునిగిన చౌటిపల్లె భూములు (ఫైల్‌)

కూలీలుగా మారిన అన్నదాతలు 

ధీనవాస్థలో గండికోట ముంపు రైతులు


కొండాపురం, జూలై 5 : ఆ ప్రాంతం పచ్చటి పొలాలతో కళకళలాడుతూ ఎప్పుడు కనిపించేది. నేడు ఆ పొలాలన్నీ నీట మునిగాయి. వ్యవసాయమే జీవనాధారంగా చేసుకుని జీవించే రైతన్నలు రోడ్డున పడ్డారు. ఏదో ఒక పనిచేసుకుందామంటే ఉపాధి లేక.. ప్రభుత్వాలు ఇవ్వాల్సిన పరిహారం అందక... చేసుకునేందుకు భూములు లేక.. పక్కనే ఉన్న భూములు కొనాలంటే లక్షలు వెచ్చించలేక ధీనావస్థలో కొట్టుమిట్టాడుతున్నారు. చేసేది లేక కొందరు కూలీలుగా వెళ్లాల్సిన దుస్థితి. కాగా అప్పట్లో డీకేటీ భూములు ఇప్పిస్తామని చెప్పిన నేతలు, అధికారులు తమ వైపు కన్నెత్తి చూడటం లేదని.. ఉన్న ఊరు విడిచి పునరావాసంలో తలదాచుకుంటే అక్కడ ఉండటానికే సరైన వసతులు లేవని వాపోతున్నారు. ఇదీ ఏళ్ల తరబడి కష్టించి పంట లు పండించి.. పది మందికి పట్టెడు అన్నం పెట్టిన గండికోట ముంపు గ్రామాల అన్నదాతల ఆవేదన. 

 

ఇచ్చింది గోరంత.... కొనాల్సింది కొండంత

గండికోట ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతులకు అప్పట్లో ఇచ్చింది గోరంత అయితే... కొండంత పెట్టి కొనాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. అప్పట్లో ఎకరాకు కేవలం రూ.1,25,000 వరకు మాత్రమే పరిహారం చెల్లించారు. పక్కనే ఇలాంటి భూములు కొనాలంటే కనీసం రూ.10లక్షల వరకు వెచ్చించాలి. డీకేటీ భూములిప్పిస్తామని చెప్పిన నాయకులు, అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని వాపోతున్నారు. గతంలో అసైన్‌మెంట్‌లో కూడా గండికోట రైతులకు డీకేటీ భూములు దక్కలేదు. ప్రస్తుత ప్రభుత్వంలో అసైన్‌మెంట్‌ ఊసేలేదు. 


పరిహారం అందక.. భూములు లేక..

ఊళ్లు ఖాళీ చేసి ఎళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ అర్హులైన చాలా మందికి పునరావాస పరిహారం అందలేదు. గండికోట ప్రాజెక్టులో 2020వ సంవత్సరం డిసెంబరులో పూర్తి స్థాయిలో నీటిని నింపడంతో గ్రామాలన్నీ దాదాపు ఖాళీ చేశారు. ఈ గ్రామాలకు చెందిన రైతుల భూములు, ఇండ్లు అన్నీ దాదాపు పూర్తిగా మునిగి పోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములు నీటమునిగి పోవడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తినడానికి గింజలు కూడా లేవని కొందరు ఆవేదన చెందుతున్నారు. భూములు మునిగి పోవడంతో గత్యంతరం లేక కొంతమంది కూలీలుగా వెళుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గండికోట ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన తమకు డీకేటీ భూములిచ్చి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.


Updated Date - 2022-07-06T05:00:20+05:30 IST