వారసులకు నో చాన్స్‌!

ABN , First Publish Date - 2022-09-29T05:21:32+05:30 IST

‘వచ్చే ఎన్నికల్లో వారసులకు అవకాశం లేదు. అందుకే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కుటుంబసభ్యులు, వారసులుగా చెప్పుకునే వారు తిరిగితే దానిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఇంటింటికీ వెళ్లకుండా రోడ్ల వెంబడి తిరిగినా మేము గుర్తించటం లేదు. చివరి ఆరునెలల్లో చేసిన సర్వేలకు అనుగుణంగానే పోటీచేసే అభ్యర్థులను నిర్ణయిస్తా. ఈ విషయంలో మళ్లీ మళ్లీ చెప్పించుకోవద్దు’ అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన సంకేతం ఇచ్చారు.

వారసులకు నో చాన్స్‌!
సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, నాగార్జనరెడ్డి, ఇన్‌చార్జిలు కృష్ణచైతన్య, రామనాథంబాబు

వచ్చే ఎన్నికల్లో సర్వేలే ప్రామాణికం 

చివరి ఆరునెలలే కీలకం!

వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలకు స్పష్టం చేసిన జగన్‌ 

‘గడపగడప’లో  వెనుకబడిన బాలినేని, మానుగుంట

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

‘వచ్చే ఎన్నికల్లో వారసులకు అవకాశం లేదు. అందుకే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కుటుంబసభ్యులు, వారసులుగా చెప్పుకునే వారు తిరిగితే దానిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఇంటింటికీ వెళ్లకుండా రోడ్ల వెంబడి తిరిగినా మేము గుర్తించటం లేదు. చివరి ఆరునెలల్లో చేసిన సర్వేలకు అనుగుణంగానే పోటీచేసే అభ్యర్థులను నిర్ణయిస్తా. ఈ విషయంలో మళ్లీ మళ్లీ చెప్పించుకోవద్దు’ అంటూ  వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లకు  సీఎం జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన సంకేతం ఇచ్చారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నిర్దేశిత రోజులు తిరగని వారి జాబితాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, మానుగుంట మహీధర్‌ రెడ్డిలు ఉన్నారని వెల్లడించారు. బుధవారం తాడేపల్లిలో జరి గిన ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌ల సమావేశంలో ఆయన మాట్లాడా రు. గడపగడపకు కార్యక్రమంపై నెలనెలా సమీక్ష చేస్తున్న ఆయన ఈసారి 72 రోజుల తర్వాత సమావేశాన్ని నిర్వహిం చారు. అదే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ కార్యక్రమం నిర్వహించని వారి పేర్లని చదివి వినిపించారు. వారిలో ఒంగోలు, కందుకూరు ఎమ్మెల్యేలు బాలినేని, మానుగుంటలు ఉన్నట్లు వెల్లడించారు. ‘పార్టీ ఇచ్చిన క్యాలెండర్‌ ప్రకారం వారంలో నాలుగు రోజుల చొప్పున నెలలో 16 రోజులు గడపగడపకు నిర్వహించాలి. ప్రతి నెలలో ఆరు సచివాలయాల్లో కార్యక్రమాన్ని పూర్తిచేయాలి. ఆ ప్రకారం నిర్వహించని వారు 26 మంది ఉన్నారు. వారిలో నాకు అత్యంత సన్నిహితులు, కావాల్సిన వారు, పార్టీకి ముఖ్యులు కూడా ఉన్నారు. అయినా వారి పేర్లు వెల్లడిస్తున్నాను’ అని చెప్పారు. రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని బాగా నిర్వహిస్తున్న వారి జాబితాను కూడా తయారుచేసినట్లు ఆయన సమావేశంలో తెలిపారు. అయితే ఆ జాబితాను ప్రకటించలేదు. తొలి పదిమందిలో పర్చూరు, అద్దంకి ఇన్‌చార్జ్‌లు రావి రామనాథంబాబు, కృష్ణచైతన్యలు ఉన్నట్లు తెలిసింది. కార్యక్రమాన్ని ఆలస్యంగా ప్రారంభించిన గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబు కూడా ప్రస్తుతం క్యాలెండర్‌ ప్రకారం కార్యక్రమం నిర్వహిస్తున్న వారి జాబితాలో చేరారు. రాష్ట్రంలో కొంతమంది మంత్రులు కూడా కార్యక్రమ నిర్వహణలో వెనుకబడి ఉన్నప్పటికీ జిల్లాకు చెందిన మంత్రి సురేష్‌ ఆ జాబితాలో లేరు. కాగా ఈ సందర్భంగా సీఎం ఎమ్మెల్యేలను ఉద్దేశించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలు కీలకం కాబట్టి సీనియర్లే రంగంలో ఉండాల్సి ఉంటుందన్నారు. వారసులకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, మాజీమంత్రి పేర్ని నాని కుమారులనుద్దేశించి వారిని పక్కనబెట్టి మీరే రంగంలో ఉండాలని చెప్పారు. తద్వారా జిల్లాలో తమ కుమారులను వారసులుగా పెట్టుకోవాలనుకుంటున్న కొందరు వైసీపీ నాయకులకు పరోక్ష హెచ్చరిక చేసినట్లు భావిస్తున్నారు. 


Updated Date - 2022-09-29T05:21:32+05:30 IST