బొట్టు, గాజులు, సిలువ సంగతేంటి?: హిజాబ్‌పై కోర్టులో వాదనలు

ABN , First Publish Date - 2022-02-16T23:57:03+05:30 IST

సిక్కులు టర్బన్‌లు ధరిస్తారు. హిందువుల్లోనే కొందరు దుపట్టా వేసుకుంటారు. వీళ్లెవరినీ విద్యాసంస్థల్లోకి అనుమతి లేదని చెప్పలేదు. కానీ ఒక్క హిజాబ్ ధరించిన వారిని మాత్రమే విద్యా సంస్థల్లోకి అనుమతించలేదు..

బొట్టు, గాజులు, సిలువ సంగతేంటి?: హిజాబ్‌పై కోర్టులో వాదనలు

బెంగళూరు: కర్ణాటక హైకోర్టులో బుధవారం హిజాబ్‌పై వాడి వేడి వాదనలు జరిగాయి. ప్రస్తుతం ఈ వివాదానికి సంబంధించి హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ వాదనలు వింటోంది. హిజాబ్ వివాదంపై ముస్లిం బాలికల తరపు న్యాయవాది రవి కుమార్ కోర్టు ముందు వినిపించారు. ఎన్నో మతాలు ఉన్నాయని, మతాలకు అనుగుణంగా ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయని, మరి అలాంటప్పుడు ఒక్క ముస్లిం విద్యార్థులకే ఎందుకు నిబంధనలు అమలు చేస్తున్నారని రవి కుమార్ ప్రశ్నించారు.


‘‘సిక్కులు టర్బన్‌లు ధరిస్తారు. హిందువుల్లోనే కొందరు దుపట్టా వేసుకుంటారు. వీళ్లెవరినీ విద్యాసంస్థల్లోకి అనుమతి లేదని చెప్పలేదు. కానీ ఒక్క హిజాబ్ ధరించిన వారిని మాత్రమే విద్యా సంస్థల్లోకి అనుమతించలేదు. మన దేశంలో ఒకరి మతాన్ని ఇంకొకరు గౌరవిస్తారని, ఈ వైవిధ్యం గురించి గొప్పగా చెప్పుకుంటాం. కానీ, ఈ ప్రభుత్వం కేవలం ముస్లిం బాలికలపైనే ఎందుకు ఈ వివక్ష చూపిస్తోంది?. హిజాబ్ మతపరమైన సంప్రదాయం కాదా? పేద ముస్లిం బాలికల హిజాబ్‌లు ఎందుకు తొలగిస్తున్నారు?’’ అని కోర్టు ముందు న్యాయవాది రవి కుమార్ వాదించారు.


‘‘బొట్టు పెట్టుకున్న విద్యార్థిని బయటికి పంపలేదు. గాజులు వేసుకున్న విద్యార్థిని బయటికి పంపలేదు. సిలువ ధరించిన విద్యార్థిని బయటికి పంపలేదు. కానీ హిజాబ్ ధరించిన విద్యార్థిని మాత్రమే ఎందుకు బయటికి పంపారు? ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్-15కు వ్యతిరేకం. గూంగట్స్‌కు అనుమతి ఉన్నప్పుడు, గాజులకు అనుమతి ఉన్నప్పుడు, టర్బన్‌లకు అనుమతి ఉన్నప్పుడు, హిజాబ్‌కు ఎందుకు అనుమతి లేదు? మతం ఆధారంగా పక్షపాతం చూపిస్తున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తరగతి గది నుంచి బయటికి పంపించారు’’ అని కర్ణాటక హైకోర్టు ముందు న్యాయవాది రవి కుమార్ వాదనలు వినిపించారు.

Updated Date - 2022-02-16T23:57:03+05:30 IST