మెడికల్ కాలేజీకి దరఖాస్తు ఏదీ!?
ABN , First Publish Date - 2022-05-14T17:24:07+05:30 IST
మెడికల్ కళాశాల కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని, అసలు ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి ప్రతిపాదనల దరఖాస్తులు రాలేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో తండ్రీ కుమారులు కేసీఆర్, కేటీఆర్ అవినీతి, అరాచక పాలన..
తుక్కుగూడలో అమిత్షా సభ ఏర్పాట్ల పరిశీలన
ఆదిభట్ల: మెడికల్ కళాశాల కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని, అసలు ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి ప్రతిపాదనల దరఖాస్తులు రాలేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో తండ్రీ కుమారులు కేసీఆర్, కేటీఆర్ అవినీతి, అరాచక పాలన సాగిస్తున్నారని, వారి అవినీతి సామ్రాజ్యాన్ని కూల్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. తుక్కుగూడలో సభ ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, గరికపాటి మోహన్రావు తదితరులు ఆయన వెంట ఉన్నారు. బడ్జెట్ ప్రతిపాదనలను విపరీతంగా పెంచి చూపించడం, తర్వాత ఖర్చుల విషయంలో చేతులెత్తేయడం కేసీఆర్ మార్కు పాలన అంటూ కిషన్ రెడ్డి విమర్శించారు. అవినీతి పాలనతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసి.. ఇప్పుడు ఫామ్హౌజ్లో పడుకొని దేశ్కీ నేతా అంటూ కేసీఆర్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని, అందుకు సంబంధించిన పూర్తి స్పష్టతను సభలో అమిత్ షా ఇస్తారని చెప్పారు.