ఇంటర్ స్పాట్కు గైర్హాజరైతే రూ.10వేల జరిమానా: ఆర్ఐవో
ABN , First Publish Date - 2022-08-19T06:21:30+05:30 IST
‘తిరుపతిలోని ఎస్వీ జూనియర్ కళాశాల కేంద్రంగా ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకనం(స్పాట్ వ్యాలుయేషన్) ప్రారంభమైంది
తిరుపతి(విద్య),ఆగస్టు 18: ‘తిరుపతిలోని ఎస్వీ జూనియర్ కళాశాల కేంద్రంగా ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకనం(స్పాట్ వ్యాలుయేషన్) ప్రారంభమైంది. ఈవిధులకు అలాట్ చేసిన అధ్యాపకులు గైర్హాజరైతే రూ.10వేలు జరిమానా విధిస్తాం’ అని ఆర్ఐవో డాక్టర్ గోపాల్రెడ్డి హెచ్చరించారు. ఈపరీక్షలకు సంబంధించి అన్ని సబ్జెక్టుల్లో గురువారం నుంచి మూల్యాంకనం ప్రారంభించామని, కేటాయించిన ఎగ్జామినర్ల జాబితా, ఆర్డర్లు ఏపీ ఇంటర్బోర్డు నుంచి ప్రాంతీయ ఇంటర్మీడియట్ కార్యాలయానికి చేరాయన్నారు. కాగా ఎక్కువసంఖ్యలో అధ్యాపకులు మూల్యాంకన ప్రక్రియకు హాజరుకాలేదని, దీనివల్ల స్పాట్వ్యాలుయేషన్ ఆలస్యమవుతుందని తెలిపారు. ఇంగ్లీషు సబ్జెక్టుల్లో 57మంది, సంస్కృతంలో 30మంది, గణితంలో 197మంది, రసాయనశాస్త్రంలో 100మంది, ఫిజిక్స్లో 24, జువాలజీలో 8, అర్ధశాస్త్రంలో 17, చరిత్రలో ముగ్గురు చొప్పున అధ్యాపకులు ఇప్పటికీ రిపోర్ట్ చేయలేదని, వీరికి షోకాజ్ నోటీసులు జారీచేశామని వెల్లడించారు. విధులు కేటాయించిన అధ్యాపకులు శుక్రవారంలోపు రిపోర్ట్ చేయాలని, లేకుంటే జరిమానా చెల్లించాల్సి రావడంతోపాటు ఆ అధ్యాపకులు ప్రైవేట్ కళాశాలలకు చెందిన వారైతే ఆకళాశాల గుర్తింపు రద్దుచేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులు గైర్హాజరైతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.