అతిథులు రారంగ..!

ABN , First Publish Date - 2020-11-01T11:24:06+05:30 IST

పర్యాటకులను ఆనందింపజేసే విదేశీ అతిథులు వచ్చేశాయి.

అతిథులు రారంగ..!

 నేలపట్టులో విదేశీ విహంగాల విడిది

 ‘కరోనా’ నేపథ్యంలో సందర్శకులు నో ఎంట్రీ!


దొరవారిసత్రం, అక్టోబరు 31 : పర్యాటకులను ఆనందింపజేసే విదేశీ అతిథులు వచ్చేశాయి. దొరవారిసత్రం మండలం నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలో పచ్చగా పరుచుకున్న చెట్లపై తెల్లని పువ్వులులా కొలువుదీరాయి. వాటి కిలకిలరావాలతో ఆ కేంద్రం కొత్తశోభను సంతరించుకుంది. యేటా ఆనవాయితీగా అక్టోబరులో వివిధ దేశాల నుంచి పక్షులు ఇక్కడకు వస్తాయి. ఇప్పటికే 12 రకాల పక్షులు నేలపట్టుకు విచ్చేసి విడిది చేశాయి. వీటిలో ఆనవాయితీగా తొలి విడిది పక్షిగా వచ్చే ఓపెన్‌ బిల్డ్‌ స్టార్క్స్‌ (నత్తగుల్ల కొంగలు) 2,217 ఉన్నాయి. కేంద్రంలోని మంచినీటి చెరువుల్లో ఉన్న పచ్చని కడప చెట్లపై కొలువై గూళ్ళు కట్టుకొనే పనిలో పడ్డాయి. అలాగే పెలికాన్స్‌ (గూడబాతులు) 765, కార్మోరెంట్స్‌ (నీటికాకులు) 345, లిటిల్‌ ఈ గ్రేట్స్‌ (చిన్నస్వాతి కొంగలు) 74, స్పూన్‌బిల్‌ (తెడ్డుముక్కు కొంగలు) 62, వైట్‌ఐబీస్‌ (తెల్లకంకణాయి) 745, కూట్స్‌ 15, డాటర్‌ (పాము మెడ పక్షి) 2,  నైట్‌ హెరాన్‌ (శబరి కొంగలు) 256, విజిలింగ్‌ డక్స్‌ 87, డాబ్‌చిక్స్‌ (బుడగ బాతులు) 14, ఇండియన్‌ మోర్‌హెన్స్‌ (జమ్ముకోళ్ళు) 14 ఇలా 4596 పక్షులు నేలపట్టుకు చేరాయి.


  పచ్చదనం పరుచుకుని..

ఇటీవల ఈ ప్రాంతంలో తేలికపాటి వర్షాలు కురవడంతో నేలపట్టు పక్షుల కేంద్రంలోని మంచినీటి చెరువుల్లోకి కొద్ది పాటి నీరు చేరింది. తొలకరి వర్షాలతోపాటుగా ఈ పక్షుల రాక కూడా మొదలైంది. మరో వారంలోపు నేలపట్టుకు ప్రసిద్ధి చెందిన పెలికాన్‌ (గూడ బాతు) పక్షుల సంఖ్య వేలలోకి పెరిగే అవకాశం ఉన్నట్లు స్థానిక వన్యప్రాణి అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ యేడాది కూడా వాతావరణం అనుకూలిస్తే విదేశీ విహంగాల సంఖ్య మరింత పెరగడంతోపాటు వాటి సంతానోత్పత్తితో పక్షుల కేంద్రం సందడిగా మారనుంది. అయితే, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ కేంద్రంలోకి సందర్శకులను అనుమతించడం లేదు.  

Updated Date - 2020-11-01T11:24:06+05:30 IST