మతపరమైన దాడులకు పాల్పడేలా యువకులకు ఖాదర్ శిక్షణ: నిజామాబాద్ CP
ABN , First Publish Date - 2022-07-06T19:30:30+05:30 IST
జిల్లాలో నిషేధిత సీమీ అనుబంధ సంస్థ పీఎఫ్ఐ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్ అరెస్ట్పై నిజామాబాద్ సీపీ కేఆర్ నాగరాజు స్పందించారు.
నిజామాబాద్: జిల్లాలో నిషేధిత సీమీ అనుబంధ సంస్థ పీఎఫ్ఐ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్ అరెస్ట్పై నిజామాబాద్ సీపీ(Nizamabad CP) కేఆర్ నాగరాజు(Nagaraju) స్పందించారు. బుధవారం ఏబీఎన్తో మాట్లాడుతూ... కరాటే శిక్షణ పేరుతో మత పరమైన దాడులకు పాల్పడేలా అబ్దుల్ ఖాదర్ అమాయక యువకులకు శిక్షణ ఇచ్చారని తెలిపారు. నిజమాబాద్లో 200 మందికి పైగా ఖాదర్ శిక్షణ ఇచ్చినట్లు సమాచారం ఉందన్నారు. అన్ని రకాల ఆధారాలతో మిగతా వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని సీపీ తెలిపారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పేరుతో శిక్షణ పొందిన వారిపై నిఘా పెట్టినట్లు చెప్పారు. పి.ఎఫ్.ఐ.పై ఇతర రాష్ట్రాల్లో నిషేధం ఉందని... నిషేధిత సిమి నుంచి బయటకు వచ్చిన వ్యక్తులు పి.ఎఫ్.ఐ. ఏర్పాటు చేశారని అన్నారు. అమాయక ముస్లిం యువకులు.. పి.ఎఫ్.ఐ. ప్రభావానికి లోనుకావొద్దని పోలీస్ కమిషనర్ నాగరాజు సూచించారు.
కాగా... జిల్లాలో ఉగ్ర లింకుల కలకలం రేగింది. నిషేధిత సీమీ అనుబంధ సంస్థ పీఎఫ్ఐ ట్రైనర్ ఖాదర్ అరెస్ట్తో కుట్ర బయటపడింది. పీఎప్ఐ ట్రైనింగ్ పేరుతో మత ఘర్షణలకు కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. నిజామాబాద్ ఆటోనగర్లోని ఓ ఇళ్లు కేంద్రంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా... పోలీసులు భగ్నం చేశారు. శిక్షణలో జగిత్యాల, హైదరాబాద్, కర్నూలు, నెల్లూరు, కడపకు చెందిన యువకులు ఉన్నట్లు గుర్తించారు. ఖాదర్ నివాసంలో మరణాయుధాలు, నిషేధిత సాహిత్యం, నోట్ బుక్స్ లభ్యమయ్యాయి. మత ఘర్షణలు జరిగినప్పుడు భౌతిక దాడులు ఎలా చేయాలనే దానిపై శిక్షణ ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు.