రైతన్నకు ‘నివర్’ దెబ్బ
ABN , First Publish Date - 2020-11-28T05:13:43+05:30 IST
నివర్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని నంద్యాల పార్లమెంటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మీనరసింహయాదవ్ డిమాండ్ చేశారు.
- రెండు రోజుల నుంచి తుఫాన్
- దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అధికారులు, నాయకులు
జిల్లాలో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న నివర్ తుఫాన్ వల్ల రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు. మిరప, పత్తి, వరి, వేరుశనగ, మొక్కజొన్న పంటలన్నీ నీటమునిగాయి. చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. నంద్యాల రెవెన్యూ డివిజన్ పరిధిలో వర్షపాతం 760 మి.మీ నమోదైందని అధికారులు తెలిపారు. నష్టపోయిన పంటలను అధికారులు, రాజకీయ నాయకులు పరిశీలించారు. వెంటనే పరిహారం చెల్లించాలని నాయకులు డిమాండ్ చేశారు.
ఆళ్లగడ్డ, నవంబరు 27: నివర్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని నంద్యాల పార్లమెంటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మీనరసింహయాదవ్ డిమాండ్ చేశారు. బాచేపల్లి గ్రామంలో తుఫాన్ వల్ల నీటి మునిగిన వరి, మినుము పంటలను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నంద్యాల పార్లమెంటు పరిధిలో 30 వేల ఎకరాల్లో వరి, మినుము పంటలు దెబ్బతిన్నాయని ఆయన అన్నారు. ఎకరాకు రూ. 20 వేలు నష్టపరిహారం అందించాలని ఆయన కోరారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగభూషణం, మోహన్, మన్సూర్, సురేంద్ర, నరేష్ ఉన్నారు.
రైతులను ఆదుకోవాలని మాజీ జడ్పీటీసీ చాంద్బాషా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. శుక్రవారం ఆయన మండలంలోని కోటకందుకూరు గ్రామంలో తుఫాన్ వల్ల నేలకు వంగిన వరి పంటను పరిశీలించారు. రైతులకు ఎకరాకు రూ.30 వేలు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ఈయన వెంట జైలాన్బాషా, ఉసేన్వలి, మాబుబాషా, రసూల్, నరసింహ ఉన్నారు.
పంటలను పరిశీలించిన జేడీఏ
నివర్ తుఫాను వల్ల దెబ్బతిన్న పంటలను జిల్లా వ్యవసాయ సంచాలకురాలు ఉమామహేశ్వరమ్మ పరిశీలించారు. ఆమె మండలంలోని నల్లగట్ల గ్రామంలో తుఫాన్ వల్ల నేలవాలిన వరి పంటను పరిశీలించారు. మండలంలో తుఫాను వల్ల దెబ్బతిన్న పంటలను గుర్తించి నివేదించాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. ఈమె వెంట మండల వ్యవసాయాధికారి ప్రవీణ్కుమార్రెడ్డి ఉన్నారు.
నివర్ తుఫాన్ పట్ల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ రమే్షరెడ్డి కోరారు. మున్సిపాలిటీ పరిధిలోని పి.చింతకుంట గ్రామంలో నివర్ తుఫాను వల్ల దెబ్బతిన్న వరి పంటలను శుక్రవారం పరిశీలించారు. వక్కిలేరు నది పొంగే అవకాశం ఉందని అన్నారు.
శిరివెళ్ల: నివర్ తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని నేషనల్ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు చిన్నా డిమాండ్ చేశారు. రైతులు కష్టపడి పండించిన వరి, అరటి, మొక్కజొన్న, పత్తి, మినుము తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆయన ఆవేదన చెందారు.
పంటలను పరిశీలించిన అధికారులు
రుద్రవరం: మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న పంటలను శుక్రవారం తహసీల్దార్ వెంకటశివ, ఇన్చార్జి ఎంపీడీవో వరలక్ష్మి, ఏవో ప్రసాద్రావు పరిశీలించారు. తిప్పారెడ్డిపల్లెలో అరటి, నాగులవరంలో మునగ, వరి పంట పొలాలను పరిశీలించారు. అలాగే తహసీల్దార్ మాట్లాడుతూ ఆలమూరులో 2, నరసాపురంలో 1 గృహం కూలిపోయిందని అన్నారు. మండలంలో 50.6 ఎంఎం వర్షపాతం నమోదైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు నర్సిరెడ్డి, మహబూబ్బాషా, వీఆర్వోలు పాల్గొన్నారు.
జిల్లాలో గత రెండు రోజులుగా నివర్ తుఫాన్ ధాటికి రైతులు తీవ్రంగా నష్టపోయారని నంద్యాల కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షుడు లక్ష్మీనరసింహయాదవ్ అన్నారు. శుక్రవారం మండలంలోని నరసాపురం, ఆలమూరు గ్రామ పంట పొలాల్లో వర్షం ధాటికి దెబ్బతిన్న వరి పంట పొలాలను పరిశీలించారు. వర్షాలకు 30 వేల ఎకరాల్లో వ రి, మొక్కజొన్న, మినుము, ఇతర పంటలు దెబ్బతిన్నాయని అన్నారు. కార్యక్రమంలో నాగభూషణం, మోహన్, సురేంద్ర, నరేష్ పాల్గొన్నారు.
ఆలమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తుఫాన్ వర్షం ధాటికి కారుతోంది. (చెమ్మ దిగుతోంది) ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న గదులన్ని చెమ్మ దిగి కారుతున్నాయి.
‘రైతులు అప్రమత్తంగా ఉండాలి’
నంద్యాల టౌన్: రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రామసుందరరెడ్డి అన్నారు. పట్టణంలోని అర్ అండ్ బీ గెస్ట్హౌస్లో మాట్లాడుతూ నివర్ తుపాన్ ప్రభావం ఇంకా రెండు రోజులు ఉంటుందన్నారు. రైతులు ధాన్యాన్ని జాగ్రత్తగా నిల్వ ఉంచుకోవాలని కోరారు. ప్రజలు పొంగి పొర్లుతున్న వంకలు, వాగులు, నదులవైపు వెళ్లరాదని సూచించారు. నంద్యాల రెవిన్యూ డివిజన్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేస్తుందని తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ వెంట నంద్యాల రెవిన్యూ డివిజన్సబ్కలెక్టర్ కల్పనకుమారి ఉన్నారు.
మిడుతూరు: వరదల్లో ప్రజల్ని అప్రమత్తం చేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆర్డీవో వెంటేశులు అధికారులకు ఆదేశించారు. వరదలను దృష్టిలో పెట్టుకుని శుక్రవారం ఆయన మండలంలోని అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీటి మట్టాన్ని, కుందు పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. వరదల వల్ల కుందు నీటిమట్టం పెరిగితే ప్రజలను అప్రమత్తం చేయాలని చేసి ప్రమా దాలు జరకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సిరాజుద్దీన్, ఆర్ఐ పాల్గొన్నారు.