చేపల వేట కాదు.. పొలంబాట!

ABN , First Publish Date - 2020-12-06T05:23:39+05:30 IST

ఆరడుగుల లోతు నీళ్లల్లో ట్యూబుల సాయంతో పంటపొలాలకు వెళ్లడం కరువు నేల కడప జిల్లాలో ఊహకైనా అందని విషయం. కానీ ఇది ఇప్పుడు వాస్తవమై రైతులను ఇబ్బంది పెడుతోంది.

చేపల వేట కాదు.. పొలంబాట!
ఆరడుగుల నీటిలో ట్యూబుల సాయంతో పొలాలకు వెళ్తున్న రైతులు

ఆరడుగుల లోతు నీళ్లల్లో ట్యూబుల సాయంతో పంటపొలాలకు వెళ్లడం కరువు నేల కడప జిల్లాలో ఊహకైనా అందని విషయం. కానీ ఇది ఇప్పుడు వాస్తవమై రైతులను ఇబ్బంది పెడుతోంది. గాలివీడు మండలంలో 12 ఏళ్ల క్రితం వెలిగల్లు ప్రాజెక్టు నిర్మించారు. ప్రాజెక్టు ముంపులో పోనూ ఇంకా రైతులకు అక్కడ 200 ఎకరాలు భూములున్నాయి. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అధికారులు మిగిలిన భూములకు దారి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చి పనులు పూర్తి చేశారని రైతులు అంటున్నారు. ప్రాజెక్టు పూర్తయిన పుష్కరకాలానికి ఇటీవల కురిసిన వానలతో ఇది నిండుకుండలా మారింది. దీంతో రైతుల పొలాలకు వెళ్లే దారిలో ఆరడుగుల లోతు నీళ్లు నిలిచాయి. ప్రస్తుతం ఈ 200 ఎకరాల్లో వేరుశనగ, వరి, బొప్పాయి సాగులో ఉన్నాయి. పొలాల వద్దకు వెళ్లాలంటూ రెండే మార్గాలున్నాయి. ఒకటి ఆరడుగుల లోతు నీళ్లల్లో సుమారు ఒక కిలోమీటరు వెళ్లడం. లేదంటే మరో వైపున్న సోలార్‌ ప్లాంట్‌లో నుంచి 5 కి.మీ. చుట్లూ తిరిగి నేలపైనే వెళ్లడం. అయితే సోలార్‌ ప్లాంట్‌కు కంచె వేయడంతో అక్కడ రైతులకు ప్రవేశం లేదు. దీంతో పొలం పనులకు వెళ్లేందుకు రైతులు ఇలా చేపల వేటకు వెళ్లేవారిలా ట్యూబుల సాయంతో నీళ్లల్లో వెళ్లాల్సి వస్తోంది. మనుషులు వెళ్లడం వరకూ ఓకే.. పండిన ధాన్యాన్ని, బొప్పాయి కాయలను ఇటువైపు చేర్చాలంటే ఎలా? ఇప్పుడు రైతులకు ఆందోళన కలిగిస్తున్న విషయం ఇదే. వెంటనే ప్రాజెక్టు అధికారులు తమ పొలాలకు దారి సౌకర్యం కల్పించాలని రైతులు కోరుతున్నారు.

- గాలివీడు

Updated Date - 2020-12-06T05:23:39+05:30 IST