యాదగిరీశుడికి శాస్త్రోక్తంగా నిత్యార్చనలు

ABN , First Publish Date - 2022-08-12T06:12:37+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్య సన్నిధిలో గురువారం స్వామికి నిత్యవిధి కైంకర్యాలు, మహాలక్ష్మీ అమ్మవారికి కోటి కుంకుమార్చన ఆగమశాస్త్రరీతిలో కొనసాగాయి. శ్రావణమాసం సందర్భంగా ఆలయ అష్టభుజి ఈశాన్య ప్రాకారమండపంలో మహాలక్ష్మీ అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు.

యాదగిరీశుడికి శాస్త్రోక్తంగా నిత్యార్చనలు
కోటి కుంకుమార్చన నిర్వహిస్తున్న అర్చకుడు

ఆకట్టుకున్న నగర సంకీర్తన

యాదగిరిగుట్ట, ఆగస్టు11: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్య సన్నిధిలో గురువారం స్వామికి నిత్యవిధి కైంకర్యాలు, మహాలక్ష్మీ అమ్మవారికి కోటి కుంకుమార్చన ఆగమశాస్త్రరీతిలో కొనసాగాయి. శ్రావణమాసం సందర్భంగా ఆలయ అష్టభుజి ఈశాన్య ప్రాకారమండపంలో మహాలక్ష్మీ అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అర్చకులు, రుత్వికబృందం అమ్మవారి సహస్రనామ పఠనాలతో కోటికుంకుమార్చన పూజలు నిర్వహించారు. ప్రభాతవేళ లక్ష్మీనృసింహుడిని సుప్రభాతంతో మేల్కొలిపి నిత్యవిధి కైంకర్యాలు చేశారు. అష్టభుజి ప్రాకార మండపంలో ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించి హోమం, నిత్య తిరుకల్యాణపర్వాలను నిర్వహించారు. కొండపైన అనుబంధ శివాలయంలో రామలింగేశ్వరుడికి, మహామండపంలో స్ఫటికమూర్తులకు నిత్యపూజలు శైవాగమ పద్ధతిలో కొనసాగాయి. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.12,35,905 ఆదాయం సమకూరింది. యాదగిరిక్షేత్రంలో గురువారం రాష్ట్ర దేవాదాయశాఖ ఆదేశాల మేరకు 75వ భారత స్వాతంత్య్ర వజ్రోత్సోవాల్లో భాగంగా నగర సంకీర్తన వేడుకలు వైభవంగా కొనసాగాయి. కార్యక్రమం లో దేవస్థాన ఈవో గీతారెడ్డి, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ ఎరుకల సుధాహేమేందర్‌గౌడ్‌, దేవస్థాన సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, కళాకారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-12T06:12:37+05:30 IST