మద్యనిషేధ చట్టంలో మార్పులకు నితీష్ సర్కార్ సిద్ధం

ABN , First Publish Date - 2022-01-18T20:23:26+05:30 IST

మద్యనిషేధ చట్టంలో కొన్ని సడలింపులు చేసేందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్..

మద్యనిషేధ చట్టంలో మార్పులకు నితీష్ సర్కార్ సిద్ధం

పాట్నా: మద్యనిషేధ చట్టంలో కొన్ని సడలింపులు చేసేందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలోని బీహార్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. చట్టాన్ని సమీక్షించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు అధికార జేడీయూ ప్రభుత్వంలోని ఉన్నతాధికారికి ఒకరు తెలిపారు. మద్యపాన నిషేధాన్ని ఉల్లంఘించే వారిపై అమలు చేస్తున్న ఆంక్షలను సడలించే ప్రతిపాదన రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు ఆయన చెప్పారు.


బీహార్‌లో మద్యనిషేధం అమలు దయనీయంగా ఉందంటూ ఇటీవల కాలంలో విపక్షాల విమర్శలను ప్రభుత్వం ఎదుర్కొంటోంది. 2016 ఏప్రిల్‌లో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు మద్యనిషేధం అమల్లోకి తెచ్చారు. దీనికి ఆర్‌జేడీ, కాంగ్రెస్ సైతం మద్దతు తెలిపాయి. అయితే, ఇటీవల ముజఫర్‌పూర్, గోపాల్‌గంజ్, బెటియా, సమస్టిపూర్, వైశాలి, నవడా తదితర ప్రాంతాల్లో కల్తీమద్యం చావులు చోటుచేసుకోవడంతో ప్రభుత్వం పునరాలోచన చేయాల్సిన అవసరం ఏర్పడింది. చట్టంలో కొన్ని సడలింపులు ఇచ్చే ఆలోచన చేస్తోంది. అధికార ఎన్డీయే భాగస్వాములు కూడా మద్యనిషేధం చట్టాన్ని సమీక్షించేందుకు సానుకూలంగా ఉన్నారు.


కాగా, చట్టంలో చేపట్టనున్న సవరణల ప్రకారం.. మద్యనిషేధ చట్టాన్ని ఉల్లంఘించి తప్పతాగి పట్టుబడిన వారి నుంచి అపరాధ రుసుము వసూలు చేసి అక్కడికక్కడే విడిచిపెడతారు. అయితే, పదేపదే ఇలా చేసే వారిని మాత్రం చట్ట ప్రకారం జైలుకు పంపుతారు. ఈ తరహా సడలింపులతో మద్యం ఇంట్లోనే తీసుకునేందుకు, హోం డెలివరీకి మార్గం సుగగమవుతుందని అంటున్నారు.

Updated Date - 2022-01-18T20:23:26+05:30 IST